ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు డబుల్ ఫోల్డ్ మోడల్స్ మాత్రమే వచ్చినా, ఇప్పుడు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కొత్త సంచలనానికి తెరలేపబోతోంది. తొలిసారిగా ట్రై-ఫోల్డబుల్ మొబైల్ను గెలాక్సీ G ఫోల్డ్ పేరుతో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీంతో శాంసంగ్ మరోసారి మొబైల్ టెక్నాలజీలో కొత్త మైలురాయిని చేరుకోనుంది.
గతేడాది శాంసంగ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (SDC)లో ఈ ట్రై-ఫోల్డబుల్ ఫోన్ నమూనాను మొదటిసారి ప్రదర్శించింది. అప్పటినుంచి ఈ మోడల్పై నిరంతర కసరత్తులు కొనసాగిస్తున్న కంపెనీ, ఈ ఏడాది జూలైలో జరగబోయే గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో అధికారికంగా ఆవిష్కరించే అవకాశం ఉందని సమాచారం. గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE మోడల్స్తోపాటు ఈ కొత్త ఫోన్ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.
నవంబర్ 29, 2025న దక్షిణ కొరియాలో జరగబోయే ప్రత్యేక ఈవెంట్లో శాంసంగ్ ఒకేసారి మూడు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ను తీసుకురానుంది. వీటిలో గెలాక్సీ G ఫోల్డ్ ట్రై-ఫోల్డ్ ఫోన్, ప్రాజెక్ట్ ముహాన్ పేరిట XR హెడ్సెట్, అలాగే AI గ్లాసెస్ ఉన్నాయి. ఈ మూడు డివైసులు 2026 ప్రారంభంలో ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ట్రై-ఫోల్డ్ విభాగంలో హువావే మేట్ XT ఒక్కటే ఉన్నది. శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ దానికి ప్రధాన ప్రత్యర్థిగా నిలవనుంది. అయితే డిజైన్, డిస్ప్లే పరిమాణం, సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ పరంగా శాంసంగ్ ఫోన్ మేట్ XT కంటే భిన్నంగా ఉండనుందని లీకులు సూచిస్తున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లో ట్రై-ఫోల్డ్ విభాగంలో పోటీ మరింత ఉత్కంఠ భరితంగా మారనుంది.
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, గెలాక్సీ G ఫోల్డ్ 6.4–6.54 అంగుళాల కవర్ డిస్ప్లే, 9.9–10.2 అంగుళాల మెయిన్ ఫోల్డబుల్ డిస్ప్లేతో వస్తుందని అంచనా. డ్యూయల్ ఇన్నర్-ఫోల్డింగ్ మెకానిజం ఉండటం ప్రత్యేకత. అదనంగా 5,600mAh బ్యాటరీ, 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభించనుంది. అలాగే *S Pen సపోర్ట్* కూడా ఉండబోతుందని లీకులు సూచిస్తున్నాయి.
ధర విషయానికి వస్తే, హువావే మేట్ XT దాదాపు 2,800 డాలర్లు (₹2.38 లక్షలు) ఖరీదుగా ఉండటంతో, శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ కూడా దానికి సమానంగా లేదా మరింత ఎక్కువ ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొదట స్పెషల్ ఎడిషన్గా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఈ ఫోన్ ప్రీమియం కేటగిరీ యూజర్లను లక్ష్యంగా చేసుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.