ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 48 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 15, 2025లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎంబీబీఎస్ అర్హత తప్పనిసరి. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC)లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అదనంగా కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం, టైపింగ్ నైపుణ్యం అవసరం. వయోపరిమితి పరంగా అన్ని వర్గాల అభ్యర్థులు 60 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.1000గా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికులు, దివ్యాంగులకు రూ.750గా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియలో మెరిట్ ప్రాతిపదికన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరిస్తారు. విద్యార్హతలు, సర్వీస్ వెయిటేజ్ ఆధారంగా మొత్తం 100 మార్కులకు అభ్యర్థులను పరిశీలిస్తారు. తుది ఎంపికైన వారికి నెలకు రూ.55,350 వేతనం అందజేస్తారు. కాబట్టి ఈ అవకాశం కోల్పోకుండా ఆసక్తి గల అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.