ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వెల్లడించారు. రూ.2 వేల కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు పనులు గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యం పాలైనప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేగవంతం చేసిందన్నారు. జూన్లో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని, వచ్చే ఏడాది ఆగస్టులో ఎయిర్పోర్టును ప్రారంభించనున్నామని ప్రకటించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి విశాఖపట్నం కీలక కేంద్రంగా మారబోతోందని సీఎం చెప్పారు. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, యాక్సెంచర్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖలో తమ యూనిట్లు ఏర్పాటు చేయడానికి వస్తున్నాయని, దీంతో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని చెప్పారు. అదేవిధంగా విశాఖ–రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం వేగవంతం చేస్తామని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీటిని విస్తరించనున్నామని తెలిపారు. విజయనగరం జిల్లాలో తోటపల్లి, నాగావళి, వంశధార, తారక రామతీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ వంటి ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల పన్నుల డబ్బుతో జీతాలు తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మొక్కుబడిగా కాకుండా, నిజమైన సమర్పణతో పనులు చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి బాధ్యత ఉద్యోగులదేనని, వారు సమర్థవంతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. లంచాలు లేకుండా సుపరిపాలన అందిస్తామని, ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని ప్రజల ముందు నిలబెడతానని హెచ్చరించారు. అభివృద్ధికి అడ్డుపడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆడబిడ్డల భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
గత 15 నెలల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 4.71 లక్షల ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు తెలిపారు. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, వీటి ద్వారా మరో 9 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. పేదలందరికీ రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు జీఎస్టీ తగ్గింపు చేపట్టామని, దీనివల్ల రాష్ట్రానికి ఏటా రూ.8,000 కోట్ల ఆదాయం తగ్గినా ప్రజలకు లాభమవుతుందని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాల్లో ఉచిత అన్నదానం ప్రారంభించామన్నారు. అదేవిధంగా టీటీడీ ట్రస్టు ద్వారా 5,000 దేవాలయాల నిర్మాణ ప్రణాళిక రూపొందించామని వివరించారు.