ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలను తెరపైకి తీసుకొచ్చింది.. కొత్తగా ఏడు విమానాశ్రయాలు ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో కూడా కొత్త విమానాశ్రయం ప్రణాళిక చేశారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ నుంచి వచ్చిన బృందం భూముల్ని పరిశీలించి, కొత్తపట్నంలో విమానాశ్రయం నమూనాలో కొన్ని మార్పులు చేస్తే సాధ్యమని తెలిపింది.
అయితే రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ సమగ్ర నివేదిక తయారు చేయాలని ప్రకటించింది. ఈ నివేదిక పూర్తయితే భూసేకరణ మొదలవుతుంది అంటున్నారు. ఒంగోలు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొదటి దశలో 657 ఎకరాల భూమిని సేకరించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో వాన్పిక్కు చెందిన 551 ఎకరాలు, పట్టా భూమి 103 ఎకరాలు, ప్రభుత్వ భూమి 12 ఎకరాలు ఉన్నాయి.
మొదటి విడత భూసేకరణకు సుమారు రూ.102 కోట్లు పరిహారం అవసరమని అంచనా వేశారు. సబ్డివిజన్ల వారీగా భూముల వివరాలను, ఎంత పరిహారం ఇవ్వాలనే విషయాలను ప్రభుత్వానికి నివేదించారు. కేంద్ర విమానయాన సంస్థ కమిటీ సభ్యులు జనవరిలో ఒంగోలుకు సమీపంలోని అల్లూరుకు వచ్చి విమానాశ్రయం ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు. మొత్తం 1,086 ఎకరాలు అవసరమని అధికారులు తేల్చారు.
జనవరి నెలలో కమిటీ సభ్యులు కొత్తపట్నం మండలం అల్లూరులో పర్యటించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, శాసనసభ సభ్యుడు దామచర్ల జనార్దన్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన అంశాలను వారికి వివరించారు. విమానాశ్రయం ప్రతిపాదించిన ప్రాంతానికి పటాన్ని కమిటీ పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించగా వారు కొన్ని మార్పులు సూచించారు. మొత్తం 1,086 ఎకరాల భూమిలో, ఏ గ్రామంలో ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి ఉందో గుర్తించారు.
ప్రభుత్వ భూమి, పట్టా భూమి అనే వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ప్రకటన శుభపరిణామం అన్నారు అధికారులు. సమగ్ర నివేదిక పూర్తయితే భూసేకరణ వేగవంతం అవుతుందంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే, ప్రకటన ఇచ్చి, భూసేకరణ కోసం ప్రత్యేకాధికారిని నియమిస్తాము అంటున్నారు. గ్రామాల వారీగా భూముల వివరాలు సేకరించామని, పరిహారం అంచనా వేస్తామన్నారు.
మొత్తం మీద ఒంగోలు విమానాశ్రయం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అంతేకాదు విమానాశ్రయం ఏర్పాటుతో ఒంగోలుతో పాటు కొత్తపట్నం చుట్టుపక్కల భూముల ధరలు పెరుగుతున్నాయి అని చెబుతున్నారు.