తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రోడ్డు రవాణా శాఖ వారి నుండి శుభవార్త రానుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వారికి ఇకపై ఎక్కువ సమయం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ రెండు మహానగరాల మధ్య ప్రయాణం దాదాపు ఐదు గంటలు తక్కువ కానుంది.
ఈ మార్పుకు కారణం ఖమ్మం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు నిర్మిస్తున్న కొత్త రహదారి. దాదాపు 4,054 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారి ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ మార్గం పూర్తయితే, వాహనాలు వేగంగా, సులభంగా ప్రయాణించగలవు.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వైజాగ్ చేరుకోవాలంటే సాధారణంగా విజయవాడ మీదుగా వెళ్లాలి. దాంతో దూరం కూడా ఎక్కువ అవుతుంది, సమయం కూడా ఎక్కువ పడుతుంది. కానీ కొత్త మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరుగా ఖమ్మం, సత్తుపల్లి మీదుగా దేవరపల్లి జంక్షన్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి రాజమండ్రి, కాకినాడ మీదుగా విశాఖ చేరడం చాలా సులభంగా మారుతుంది.
ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించాలంటే దాదాపు 12 గంటలు పడుతోంది. కానీ కొత్త రహదారి ఉపయోగిస్తే దాదాపు 125 కిలోమీటర్లు తగ్గుతుంది. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది అదేవిధంగా ఇంధన ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా లారీలు, సరుకు రవాణాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇప్పటి వరకు సూర్యాపేట, ఖమ్మం, వైరా, అశ్వరావుపేట మీదుగా దేవరపల్లి చేరేవారు. అయితే ఆ మార్గంలో ఎక్కువగా లారీలు, ట్రక్కులు, గ్రానైట్ రవాణా వాహనాలు వెళుతుండటంతో రోడ్డు పరిస్థితి బాగోలేదు. దాంతో ప్రయాణం కూడా కాస్త ఇబ్బందిగా మారింది.
కొత్త హైవే కొత్త హైవే తెరిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా వేగంగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ఒక గొప్ప అవకాశంగా మారబోతోంది. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లే మార్గం సులభం, సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.