తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి సికింద్రాబాద్ – విశాఖ మధ్య ప్రారంభమైన వందేభారత్ రైలుకు ప్రజాధరణ పెరగడంతో ఇటీవలే ఈ రైలు లో కోచ్లను పెంచుతూ రైల్వేశాఖ అభివృద్ధి చేసింది. ఈ వందేభారత్ రైలు ప్రారంభం సమయంలో 16 కోచ్లతో ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. తాజాగా పెరిగిన డిమాండ్ తో వీటి కోచ్లను రైల్వేశాఖ 20కి పెంచింది. కోచ్లు పెంచడం ద్వారా వెయిటింగ్ లిస్టులో ఉండే ఈ రైలు ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది.
అయితే ఈ వందేభారత్ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతుండడంతో వారికి మరింత సౌకర్యాన్ని అందించేందుకు.. ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచేందుకు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ రైళ్లకు అదనపు స్టాపేజీలను చేర్చుతూ ఇటీవలే సదుపాయాన్ని కల్పించిన రైల్వేశాఖ తాజాగా వీటిపై మరో నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు వందేభారత్ అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఏలూరు వద్ద కల్పించిన అదనపు స్టాపేజీ సదుపాయం గడువు వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ గడువును మరో ఆరు నెలల పాటు పొడగిస్తున్నట్టు పేర్కొంది. దీనితో పాటు 20833/20834 నెంబర్ గల వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు సామర్లకోట వద్ద కల్పించిన అదనపు స్టాపేజీల సదుపాయాన్ని కూడా ఆరునెలల పాటు పెంచుతున్నట్టు తెలిపింది.
ఇదిలా ఉండగా వందేభారత్ లో స్లీపర్ సర్వీసులకు కూడా ప్రారంభించేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది. వీటి తయారీ పూర్తయితే తొలి విడతలో తెలుగు రాష్ట్రాలకు మూడు-నాలుగు మార్గాల్లో వందేభారత్ స్లీపర్ కేటాయించాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయం తీసుకుంది.