శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో తితిదే మార్పులు చేసింది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్పై దర్శనానికి మూడు రోజులు పడుతోంది. ఇకపై ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆరోజే దర్శనానికి తితిదే వీలు కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఉదయం ఆఫ్లైన్ లో శ్రీవాణి టికెట్ పొందిన భక్తులు.. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 1వ తేదీ నుంచి తితిదే దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. శ్రీవాణి టికెట్ల జారీలో ఎలాంటి మార్పు లేదని తితిదే అధికారులు స్పష్టం చేశారు. యథావిధిగా తిరుమలలో ఉదయం 10గంటలు నుంచి మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతగా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేస్తామని చెప్పారు.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అక్టోబర్ 31 వరకు ఆన్లైన్లోలో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకు దర్శనం కల్పిస్తామని తితిదే అధికారులు తెలిపారు.