ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అమల్లోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపుల ప్రభావంతో మార్కెట్లో వస్తువుల ఎమ్మార్పీ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వినియోగదారులకు నష్టం జరగకుండా, అలాగే పాత ప్యాకేజీలు వృథా కాకుండా చూడాలని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. లీగల్ మెట్రాలజీ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనల్లో కొన్ని సడలింపులు కల్పిస్తూ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ రేట్లు తగ్గడంతో కలిగే లాభం నేరుగా ప్రజలకు చేరడం, అలాగే పరిశ్రమలపై అదనపు భారాన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా పేర్కొంది.
ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆయన మాట్లాడుతూ, పాత ప్యాకేజీలపై ఉన్న ఎమ్మార్పీ స్టిక్కర్లను మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2026 మార్చి 31 వరకు పాత ప్యాకేజీలతో ఉన్న వస్తువులను మార్కెట్లో విక్రయించవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 22, 2025 లోపు తయారైన వస్తువులపై కొత్త ఎమ్మార్పీ స్టిక్కర్లు తప్పనిసరి కాదని, అయితే పాత ఎమ్మార్పీ స్టిక్కర్ను తొలగించరాదని హితవు పలికారు. అదే సమయంలో ధరలు తగ్గితే డీలర్లు వినియోగదారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తే వెంటనే 1967 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు కొత్త ధరల వివరాలను వెంటనే డీలర్లకు చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ వివరాలను తూనికలు, కొలతల శాఖ డైరెక్టర్, కంట్రోలర్కు కూడా పంపాల్సి ఉంటుంది. ధరలు తగ్గిన సందర్భంలో వినియోగదారులకు సమాచారం అందించేందుకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా వంటి అన్ని మార్గాలను వినియోగించాలని సూచించారు. అలాగే ప్రతి ప్యాకేజీపై తప్పనిసరిగా తయారీదారు పేరు, చిరునామా, ఉత్పత్తి పేరు, బరువు, తయారీ/ప్యాకింగ్ తేదీ, దిగుమతి చేసిన నెల/సంవత్సరం, గరిష్ఠ చిల్లర ధర (అన్ని పన్నులు కలిపి), వినియోగదారుల ఫిర్యాదు చిరునామా వంటి వివరాలు ఉండాలని స్పష్టం చేశారు.
వాణిజ్య పన్నులశాఖ అధికారులు మాట్లాడుతూ, జీఎస్టీ 2.0 సంస్కరణలు వినియోగదారులకు పెద్ద ఎత్తున మేలు చేయనున్నాయని అన్నారు. వ్యాపారులు మారిన రేట్ల ప్రకారం ఇన్వాయిసులు ఇవ్వాలని, అలాగే రూ.200 పైగా కొనుగోలు చేసే ప్రతి వినియోగదారు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. ఈ చర్యల వల్ల మార్కెట్లో పారదర్శకత పెరగడంతో పాటు వినియోగదారుల హక్కులు మరింత బలోపేతం అవుతాయని అధికారులు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ విధంగా జీఎస్టీ తగ్గింపులు ప్రజలకు నిజంగా ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం అవుతోంది.