ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి, నదుల అనుసంధానం, సాగు సదుపాయాలు, కరవు నివారణ, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై తన దృష్టిని వివరించారు. ఏపీ, తెలంగాణలో నేడు ఉన్న ప్రధాన ప్రాజెక్టులలో మెజారిటీ తన పాలనలోనే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. రైతుల కోసం తొలిసారి పెట్టుబడి రాయితీలు అనంతపురంలోనే ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అలాగే పాలమూరు జిల్లాలో ఉపాధి లేక వలసలు వెళ్ళే పరిస్థితిని మార్చిన విధానం, ఫ్లోరైడ్ సమస్యలతో బాధపడిన నల్గొండ జిల్లాకు శ్రీశైలం నీళ్లను అందించిన ప్రయత్నాలను గుర్తుచేశారు.
నదుల అనుసంధానమే భవిష్యత్ వ్యవసాయానికి ఆధారం అని చంద్రబాబు స్పష్టం చేశారు. వాజ్పేయీ కాలంలోనే ఈ ఆలోచనకు బాటలు వేసినా, ఆ తర్వాత ముందుకు సాగలేదని చెప్పారు. అదే విషయాన్ని నేటి ప్రధాని మోదీకి కూడా సూచించగా, కొన్ని రాష్ట్రాలు సిద్ధంగా లేవని ఆయన చెప్పారు. అయితే ఏపీ మాత్రం ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం 40 నదులు, 19 లక్షల పంప్సెట్లు ఉన్నాయని, వీటిని అనుసంధానం చేస్తే సాగునీరు విస్తృతంగా లభిస్తుందని చెప్పారు. భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం తర్వాత కనీసం 3 మీటర్లు, ముందుగానే 8 మీటర్ల మేర నీటి నిల్వలు ఉండేలా చూడాలని సూచించారు.
2014–19 మధ్యకాలంలో నీటిపారుదలకు రూ.68,417 కోట్లు ఖర్చు చేశామని, వైసీపీ పాలనలో మాత్రం రూ.28,376 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఈ ఏడాదిలోనే రూ.12,454 కోట్లు వెచ్చించామని, వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.70 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన సమస్యలు అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామని, గత పాలనలో కొట్టుకుపోయిన డయాఫ్రం వాల్ను మళ్లీ రూ.1,000 కోట్ల వ్యయంతో పూర్తి చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 25 నాటికి పోలవరం డయాఫ్రం వాల్ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, హంద్రీనీవా, వెలిగొండ వంటి ప్రాజెక్టుల పురోగతిని వివరించారు.
రాష్ట్రంలో కరవు సమస్యను శాశ్వతంగా తొలగించడమే తమ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు హామీ ఇచ్చారు. నీటిని సమర్థవంతంగా వినియోగిస్తే కరవు అనే మాట రాదని, ప్రతి నియోజకవర్గంలో జలాశయాలు నింపి, భూగర్భ జలాలను పెంపొందించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అనంతపురంలోనే 10 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించామనీ, వాటితో నీటి నిల్వలు పెరిగాయని గుర్తు చేశారు. తుంగభద్ర, శ్రీశైలం, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలో సాగునీటిని అందించామని చెప్పారు. పోలవరం పూర్తి చేయడం పూర్వజన్మ సుకృతమని, ఆ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ సస్యశ్యామలం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.