Weather Update: ఏపీలో వరుణుడి బీభత్సం.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ పిడుగులు పడే ఛాన్స్!
Ap Weather Reports: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
AP Weather Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని గంటలుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సూచించింది.
రాష్ట్రంలోని పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీనివల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అల్లూరి సీతారామరాజు, కాకినాడ వంటి మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం జిల్లా ప్రత్తిపాడులో ఈదురుగాలుల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. భారీ గాలుల వల్ల అనేక చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి రంపాలతో చెట్లను తొలగించి దారిని సుగమం చేశారు. విద్యుత్ తీగలు తెగిపడటంతో ముందు జాగ్రత్తగా అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు.
అదృష్టవశాత్తూ ఈ ఘటనల్లో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు
అకాల వర్షాల వల్ల రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికి వచ్చిన పంట నీటిపాలవుతుండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు ఈ వర్షం గండంగా మారింది. పొలాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. అటు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ ఉండకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణం అనుకూలించే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
Be the first to react