Secret Temples of India: పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నారా? ఈ గుడికి వెళ్తే చాలు.. 90 రోజుల్లో శుభవార్త పక్కా!
Secret Temples of India: మీకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదా? జాతక దోషాలు లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహం ఆలస్యం అవుతోందా? అయితే తమిళనాడులోని నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయ విశేషాల గురించి తెలుసుకోండి
Secret Temples of India: పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. కానీ ఈ రోజుల్లో సరైన సంబంధం కుదరక, అనేక అడ్డంకులు ఎదురై చాలా మంది యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కుజ దోషం, కాలసర్ప దోషం లేదా మరేదైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహం ఆలస్యమవుతుంటే, వారికి ఒక చక్కని పరిష్కార మార్గంగా కనిపిస్తోంది తమిళనాడులోని నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం. దేశంలోనే అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రం, పెళ్లి కావాలనుకునే వారికి ఒక వరప్రదాయినిగా మారింది.
తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ECR) పై ఉన్న తిరువిడందై అనే గ్రామంలో ఈ అద్భుతమైన ఆలయం కొలువై ఉంది. ఇక్కడి విశేషం ఏంటంటే, పెళ్లి కాని వారు ఒక్కసారి ఈ స్వామిని దర్శించుకుంటే చాలు, కేవలం మూడు నెలల వ్యవధిలోనే వారికి వివాహం నిశ్చయమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. జాతక చక్రంలో ఎన్ని దోషాలు ఉన్నా, ఈ పెరుమాళ్ను మనస్ఫూర్తిగా వేడుకుంటే అవన్నీ తొలగిపోతాయని ఇక్కడి వారు చెబుతుంటారు.
ఈ ఆలయంలో పాటించే ఒక వినూత్నమైన ఆచారం భక్తులను ఆకట్టుకుంటుంది. పెళ్లి కావాలని కోరుకునే వారు రెండు పూలమాలలతో ఆలయానికి వెళ్లాలి. అక్కడ అర్చన పూర్తయ్యాక, పూజారి ఒక మాలను స్వామివారికి వేసి, రెండో మాలను ప్రసాదంగా భక్తుడికి తిరిగి ఇస్తారు. ఆ మాలను మెడలో వేసుకొని భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ మాలను ఇంటికి తీసుకెళ్లి భద్రపరుచుకోవాలి. కోరుకున్నట్టుగా మూడు నెలల్లో వివాహం కుదిరిన తర్వాత, మళ్ళీ అదే మాలను తీసుకువచ్చి స్వామివారికి సమర్పించడం ఇక్కడ ముఖ్యమైన ఆచారం. ఇది ఒక రకమైన కృతజ్ఞతను చాటుకోవడం అన్నమాట.
ఈ క్షేత్రానికి ఉన్న చారిత్రక నేపథ్యం కూడా చాలా గొప్పది. స్వామివారు ఇక్కడ ప్రతిరోజూ కళ్యాణ రూపంలోనే కనిపిస్తారు, అందుకే ఆయనకు 'నిత్య కళ్యాణ పెరుమాళ్' అనే పేరు వచ్చింది. పల్లవ రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయ శిల్పకళ కూడా అబ్బురపరుస్తుంది. కేవలం ఆధ్యాత్మిక భావమే కాకుండా, మనసుకి ప్రశాంతతనిచ్చే వాతావరణం ఇక్కడ ఉంటుంది. భక్తితో పాటు ఒక పాజిటివ్ ఎనర్జీని కలుగుతుందని భక్తులు తెలుపుతుంటారు. నమ్మకం అనేది మనిషిని నడిపించే శక్తి. ఆ నమ్మకమే వేలాది మందిని ఈ ఆలయం వైపు నడిపిస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో జంటలు ఈ స్వామి కృపతో ఒక్కటయ్యాయని అక్కడ స్థానికులు చెబుతుంటారు.
Be the first to react