- ఇటీవల భారత నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్న ఇరాన్..
- Gulf: ఒమన్ తీరంలో రసాయన ట్యాంకర్పై ఇరాన్ కోస్ట్ గార్డ్ కాల్పులు..
Iran & India: పశ్చిమాసియా జలాల్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఒమన్లోని షినాస్ ఓడరేవు సమీపంలో ప్రయాణిస్తున్న 'ఎంటీ సైరన్' అనే రసాయన ట్యాంకర్పై ఇరాన్ కోస్ట్ గార్డ్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. టోగో దేశ జెండాతో ఉన్న ఈ నౌకలో భారతీయ నావికులు ఉండటం గమనార్హం. సోమవారం జరిగిన అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మందీప్ సింగ్ రణధావా ఈ దాడులను ధ్రువీకరించారు. ఏప్రిల్ 25న జరిగిన ఈ ఘటనలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా నౌకలోకి ప్రవేశించారని, అయితే ఇరాన్ కోస్ట్ గార్డ్ మాత్రం తాము హెచ్చరికగా మాత్రమే కాల్పులు జరిపామని పేర్కొనడం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఈ ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాంగ శాఖ మరియు భారత రాయబార కార్యాలయాలతో కలిసి నౌకల భద్రతపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తోంది. డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ఇప్పటికే వేలాది ఇమెయిల్స్ మరియు ఫోన్ కాల్స్ ద్వారా భారత నౌకలతో సంప్రదింపులు జరుపుతూ, సముద్ర మార్గాల్లో ప్రయాణించే సిబ్బందికి తగిన సూచనలు ఇస్తోంది. ప్రస్తుతం 2,770 భారత నౌకల కదలికలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే భారత నావికులు సురక్షితంగా ఉన్నారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రణధావా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఈ ఘర్షణ వాతావరణం అంతర్జాతీయ వాణిజ్య రవాణాపై పెను ప్రభావం చూపేలా కనిపిస్తోంది.
ఇరాన్ దళాలు భారత నౌకలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత కొద్ది రోజులుగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) వరుస దాడులకు పాల్పడుతుండటం భారత్కు పెద్ద సవాల్గా మారింది. ఏప్రిల్ 18న హర్మూజ్ జలసంధి వద్ద, అలాగే ఏప్రిల్ 22న ముంద్రా పోర్టుకు వస్తున్న నౌకలపై జరిగిన దాడులపై భారత్ ఇప్పటికే ఇరాన్కు తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. అయితే, తమ ప్రాంతీయ జలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడమే ఈ చర్యలకు కారణమని ఇరాన్ సమర్థించుకుంటోంది.