227 మండలాల్లో 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు..
19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. వర్షాలకు కూడా అవకాశం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 28 జిల్లాల్లో 20 జిల్లాలకు చెందిన 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం (28-04-2026) కూడా పరిస్థితి ఇలానే కొనసాగుతుందని, 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 21 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరోవైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వాతావరణ మార్పులు కనిపించనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులు పడే సమయంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద నిలబడకూడదని ప్రత్యేకంగా హెచ్చరించారు.
తీవ్ర వడగాల్పులు వీచే మండలాలుగా విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, రామభద్రాపురం, తెర్లాం, వంగర; పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం వంటి మండలాలను అధికారులు గుర్తించారు.
ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1°C, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8°C, అమరావతిలో 44.2°C, తిరుపతి జిల్లా బేస్తపల్లి, వైఎస్సార్ కడప జిల్లా వీరబల్లిలో 44.2°C, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44°C నమోదయ్యాయి. అలాగే అన్నమయ్య జిల్లా నూలివీడులో 43.1°C, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43°C, కర్నూలు జిల్లా కల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7°C, కాకినాడ జిల్లా కరపలో 42.4°C, శ్రీసత్యసాయి జిల్లా ముడిగుబ్బలో 42.3°C, మన్యం జిల్లా బూర్జ, అనంతపురంలో 42.2°C, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, విజయనగరం జిల్లా రాజాంలో 41.7°C, బాపట్ల జిల్లా మార్టూరులో 41.6°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో 41.5°C నమోదైనట్లు వెల్లడించారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. దాహం లేకపోయినా తరచూ నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలని సూచించారు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు గుడ్డ కట్టుకోవడం, చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం, కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ధరించడం వంటి సూచనలు ఇచ్చారు.
ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మరోసారి విజ్ఞప్తి చేసింది.