“జై భీం” నినాదాలతో దద్దరిల్లిన దుబాయి..
తెలుగు మహిళల ఐక్యత..
దుబాయిలో తెలుగు దళిత మహిళల శక్తి, ఐక్యత మరోసారి స్పష్టంగా బయటపడింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న దళిత మహిళల ఆత్మవిశ్వాసం ఈ కార్యక్రమంలో ప్రతిబింబించింది.
యూఏఈ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు దళితులు భారీగా హాజరయ్యారు. ముఖ్యంగా మహిళల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యుద్ధ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో మహిళలు స్వచ్ఛందంగా వచ్చి “జై భీం” నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
ఇందులో ఇళ్లలో పాచిపనులు చేస్తూ జీవనం సాగించే పేద మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ వారు తమకు చేతనైనంతగా విరాళాలు అందించి తమ సామాజిక బాధ్యతను చాటారు. పట్టు చీరలు ధరించి పండుగలా వచ్చి దళిత మహానేత బీఆర్ అబేద్కర్ ను స్మరించుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సవమయం చేసింది. కరమా నుంచి అజ్మాన్ వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలతో నగరం నడిబొడ్డున పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సేవా సమితి అధ్యక్షుడు తరపట్ల మోహన్ మాట్లాడుతూ, విదేశాల్లో ఆర్థికంగా ఎదిగినా స్వదేశంలో ఇంకా సామాజిక, రాజకీయ న్యాయం సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలు పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
పాస్టర్ పాలపర్త సురేశ్ మాట్లాడుతూ, పీడిత వర్గాలకు దిక్సూచి అయిన అంబేద్కర్ సూత్రాలు ఎప్పటికీ ప్రాసంగికమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రముఖులు నేలపాటి ఇస్సాక్, బండి ఐజాక్, బుంగా డేవిడ్, రామరాజు, జోసెఫ్ అంబేద్కర్, కాగిత కుమార్, కుసుమో ప్రభుదాస్, గోగి శరత్, పెదపాటి ప్రేమనంద్, యాండ్ర వెంకట్, మెదిడ శ్యాం, ఓగురి శ్రీను, గెడ్డెం నరేశ్, నమ్మితి రవి, పీటర్, యాండ్రా శ్రీను, మోకా అనిల్, పాము సత్యనారాయణ, బొక్కా శ్రీను, గెడ్డం బాలరాజు, మురళా ఆనంద, శేఖర్ తదితరులు మాట్లాడి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
మహిళా నాయకురాలు సాంబర్ మణి మాట్లాడుతూ, తరతరాలుగా అణచివేయబడ్డ తమ వర్గాలు సమాన స్థాయికి చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంటకు చెందిన గోసంగి ధనలక్ష్మి మాట్లాడుతూ, పొట్టకూటి కోసం విదేశాలకు వచ్చినప్పటికీ సామాజికంగా ఇంకా స్వదేశంలోనే ఉన్న భావన ఉందని భావోద్వేగంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో హెప్సిబా, సరిల్లా విజయ, చికిలే కుమారి, హాసినా, మారుమూడి సుధా, విజయ తదితరులు మహిళలను సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొత్తంగా, దుబాయిలో జరిగిన ఈ అంబేద్కర్ జయంతి వేడుకలు కేవలం ఒక జ్ఞాపక దినం మాత్రమే కాకుండా, దళిత మహిళల ఐక్యత, ఆత్మగౌరవం, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి.