రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఏయూ దిక్సూచి..
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖకు కొత్త చరిత్ర..
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని విశ్వవిద్యాలయాల పాత్ర, యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధిపై విస్తృతంగా మాట్లాడారు.
విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలు మాత్రమే కాకుండా, సమాజాన్ని మార్చే ఆవిష్కరణలకు వేదిక కావాలని సీఎం అన్నారు. యూనివర్సిటీలు జాతీయ ఆస్తులని, వాటిని కాపాడటం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 53 విశ్వవిద్యాలయాలకు ఆంధ్ర యూనివర్సిటీ దిక్సూచిగా నిలుస్తోందని కొనియాడారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీలో రూ.64 కోట్లతో నిర్మించిన ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్వర్క్ సెంటర్ను ప్రారంభించారు. మరో రూ.112 కోట్లతో బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్, కాన్వకేషన్ హాల్ సహా 9 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, “మీరు జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్ కావాలి. నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్స్పై దృష్టి పెట్టాలి. మీరు ఉద్యోగం చేయడమే కాదు, పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి” అని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
విశాఖలో త్వరలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందని, దాదాపు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని సీఎం తెలిపారు. ఇది విశాఖకు కొత్త చరిత్ర సృష్టించబోతుందని చెప్పారు. ఇప్పటికే 58 దేశాల విద్యార్థులు ఏయూలో చదువుతున్నారని, విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలకమని అభిప్రాయపడ్డారు.
ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రను స్మరించుకుంటూ, జైపూర్ రాజ్ విక్రమదేవ్, గజపతి, పిఠాపురం, బొబ్బిలి రాజులు ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేశారు. తొలి వైస్ చాన్స్లర్ కట్టమంచి రామలింగారెడ్డి బలమైన పునాది వేశారని, రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణ దేశ రాష్ట్రపతిగా ఎదిగారని తెలిపారు.
“నాకు 76 ఏళ్లు అయినా, నేను ఇంకా 26 ఏళ్ల యువకుడిలా ఆలోచిస్తాను” అంటూ సీఎం తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినట్లు, ఇప్పుడు డేటా సెంటర్లు, ఏఐ, క్వాంటం టెక్నాలజీలపై దృష్టి పెట్టామని చెప్పారు. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలతో ఎంఓయూలు కుదుర్చుకోవాలని, విదేశీ విద్యార్థులను ఆకర్షించాలని సూచించారు.
ఏయూ అభివృద్ధికి రూ.500 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కార్పస్ ఫండ్ రూపంలో ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పారు. భవిష్యత్తులో ఏయూ దేశంలో టాప్-5లో, ప్రపంచంలో టాప్-100లో ఉండాలని లక్ష్యంగా పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ హరిబాబు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే ప్రముఖులు సచిన్ టెండూల్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చివరగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, “స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ జైత్రయాత్ర ఆంధ్ర యూనివర్సిటీ నుంచే ప్రారంభం కావాలి. పని చేసే బాధ్యత మాది, దాన్ని విజయవంతం చేసే బాధ్యత మీది” అని పిలుపునిచ్చారు.