5G ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం…
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట…
స్మార్ట్ సేవలకు సిద్ధం….
Women Empowerment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సుపోషణ్ అభియాన్ కార్యక్రమంలో ఏపీ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గర్వంగా ప్రకటించారు. ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల కృషి వెలకట్టలేనిదని ఆమె కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల నుంచి ఏకంగా 76 గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయని ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
అవార్డులకు ఎంపికైన ప్రతి పంచాయతీకి రూ. 1 లక్ష నగదు బహుమతి అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులను పారదర్శకంగా పంపిణీ చేస్తూ.. అంగన్వాడీ పోషణ కార్యక్రమాలకు రూ. 50 వేలు, ఆయాలకు రూ. 25 వేలు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్లకు రూ. 25 వేలు కేటాయిస్తామన్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా 11 అవార్డులతో అగ్రస్థానంలో నిలవగా, ఎన్టీఆర్ తిరుపతి జిల్లాలు ఒక్కో అవార్డును సాధించాయని వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం గతంలో 70 శాతమే ఉండగా, ప్రస్తుత ప్రభుత్వ కృషితో అది ఏకంగా 96 శాతానికి చేరి దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నామని వివరించారు.
అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వారు కోరిన 10 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 9 డిమాండ్లను ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూడు సార్లు జీతాలు పెంచారని, ఒకేసారి రూ. 7 వేలు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయలు పెంచి అంగన్వాడీలను మోసం చేసిందని, 40 రోజుల పాటు ధర్నా చేసినా కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ల జీతం రూ. 11,500 గా ఉందని, దీనిని మరింత మెరుగుపరిచే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని అంగన్వాడీ వ్యవస్థకు జోడిస్తూ.. 55,745 కేంద్రాల టీచర్లు, సూపర్వైజర్లకు రూ. 75 కోట్లతో 5G మొబైల్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. గతంలో ఉన్న 15 రకాల యాప్ల గందరగోళానికి స్వస్తి పలుకుతూ, ఇప్పుడు 'సింగిల్ యాప్' విధానాన్ని తీసుకువచ్చామన్నారు. దీనివల్ల పని సులభతరం కావడమే కాకుండా పారదర్శకత పెరుగుతుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు తల్లి తర్వాత తల్లి లాంటి గుర్తింపు ఉందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని భరోసా ఇచ్చారు.
సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా రిటైర్మెంట్ గ్రాట్యుటీని టీచర్లకు రూ. 2 లక్షలు, ఆయాలకు రూ. 1.3 లక్షల వరకు పెంచినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా, అంగన్వాడీలు కోరుకున్నట్లుగా వేసవి సెలవులను కూడా పెంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న 15 రోజుల సెలవులకు అదనంగా మరో 15 రోజులు కలిపి, మొత్తం 30 రోజుల వేసవి సెలవులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం జీతాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న సిబ్బంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి, ఆందోళనలు విరమించాలని.. సోదరిగా మీకు అండగా ఉంటానని మంత్రి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు.