దక్షిణ భారత రాష్ట్రాలకు మరోసారి వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు భారత వాతావరణశాఖ (IMD) ప్రకటించింది. రేపటినుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేయబడింది. అంతేకాకుండా, ఆ తరువాత 48 గంటల్లో ఈ వాయుగుండం పూర్తి స్థాయి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ఉండవచ్చని IMD తెలిపింది. ఇప్పటికే APSDMA కీలక సూచనలు చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, కడప, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలు అలర్ట్లో ఉండాలని సూచనలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని తెలిపారు.
అంతేకాదు, త్వరలో ఏర్పడబోయే ఈ తుఫాన్కు ‘సెన్యార్’ అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ఈ పేరుకు ‘లయన్’ అనే అర్థం ఉంది. ఇటీవల వచ్చిన ‘మొంథా’ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై భారీ ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వ్యవసాయం, రవాణా, పవర్ సప్లైపై దాని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు మరోసారి తుఫాన్ సూచనలు రావడంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారాలు సూచిస్తున్నాయి.
వాతావరణ శాఖ ప్రకారం ఈ తుఫాన్కు సంబంధించిన గాలుల వేగం గంటకు 80-100 కిలోమీటర్లకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరప్రాంతాల్లో అలలు 2 నుంచి 4 మీటర్ల వరకు ఎత్తుగా ఎగిసే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. వ్యవసాయదారులు కూడా ముందుగా పంటను కోయడం, భద్రపరచడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన తుఫాన్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన రక్షణ చర్యలను చేపడుతున్నాయి. రాబోయే రోజుల్లో అధికారుల సమావేశాలు, హెచ్చరికలు, సహాయక చర్యలు మరింత వేగంగా అమలు కానున్నాయి.