Petrol Price India: పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం కీలక ప్రకటన.. వాహనదారులకు భారీ ఊరట!
Petrol Price India: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్నా, భారత దేశంలో పెట్రోల్, డీజిల్ ఎల్పీజీ ధరలను పెంచే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్యాస్ సిలిండర్ల కొరత లేదు.. అక్రమ నిల్వలకు చెక్
ఇతర దేశాల నుంచి భారీగా ఇంధన దిగుమతులు
సామాన్యుడిపై భారం పడకుండా మాస్టర్ ప్లాన్
Petrol Price India: మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతున్నా, అక్కడ ఉద్రిక్తతలు పెరుగుతున్నా సరే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న మాట నిజమే కానీ, మన దగ్గర మాత్రం సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయినప్పటికీ, భారతదేశం తన సరఫరా వ్యవస్థను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి రేట్లు పెంచే ఆలోచన లేదని, ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తుంది.
కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా వంట గ్యాస్ (LPG) విషయంలో కూడా ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా ఉండేందుకు ఇతర దేశాల నుండి దిగుమతులను పెంచుతున్నారు. ప్రస్తుతం మనకు అమెరికా నుండి కొంత గ్యాస్ వస్తుండగా, త్వరలోనే కెనడా, ఆస్ట్రేలియా నార్వే వంటి దేశాల నుండి కూడా సరఫరా మొదలవుతుంది. సిలిండర్ డెలివరీ సమయాన్ని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచడం వెనుక అసలు ఉద్దేశ్యం గ్యాస్ను అక్రమంగా నిల్వ చేసే వారిని అరికట్టడమే తప్ప, సరఫరా తగ్గించడం కాదని అధికారులు వివరించారు.
ఇక విమాన ఇంధనం (ATF) గురించి చూస్తే, మన దేశంలో దానికి సంబంధించిన స్టాక్ కూడా చాలా ఎక్కువగా ఉందని నిజానికి భారత్ విమాన ఇంధనాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది కాబట్టి, ఆ రంగంలో కూడా ధరలు పెరిగే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తోంది. పారిశ్రామిక అవసరాలకు వాడే గ్యాస్ ధరల్లో కూడా ఎటువంటి మార్పులు చేయడం లేదు. దీనివల్ల సాధారణ వినియోగదారులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 130 డాలర్ల వరకు వెళ్లినా సరే, మన దేశంలో ధరలు పెంచకుండా ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు.
సామాన్య ప్రజలపై భారం పడకుండా చూడటమే లక్ష్యంగా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాలు తీసుకుంది. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు సాధారణంగా పన్నులు తగ్గిస్తారని అందరూ అనుకుంటారు, కానీ ప్రస్తుతం పన్నుల విషయంలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ఉన్న సుంకాలను తగ్గించే ఆలోచన లేదని, అలాగని కొత్తగా పెంచే ఉద్దేశ్యం కూడా లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రపంచ దేశాల మధ్య పరిస్థితులు ఎలా మారినా సరే, దేశీయ మార్కెట్లో ఇంధన భద్రతకు ఎటువంటి ఢోకా లేదని తాజా నివేదికల ద్వారా స్పష్టమవుతోంది.
యుద్ధం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద ఉన్న పక్కా ప్లానింగ్ వల్ల ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఒకవేళ అంతర్జాతీయంగా పరిస్థితులు ఇంకా దారుణంగా మారితే, అప్పుడు మాత్రమే మళ్ళీ సమీక్ష జరుపుతామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం వాహనదారులు, గృహిణులు ధరల పెరుగుదల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే విషయంగా చెప్పుకోవచ్చు.
Be the first to react