Fuel Price Hike 2026: వాహనదారులకు షాక్... పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
Fuel Price Hike 2026: దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. లీటరుకు సుమారు రూ. 1.50 మేర పెరిగిన కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి వచ్చాయి తాజా రేట్లు మీ కోసం..
Petrol Price Today: కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజే సామాన్యుడిపై భారాల పర్వం మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి కారణాలను చూపుతూ దేశీయ చమురు సంస్థలు ఇంధన ధరలను సవరించాయి. అయితే ఈసారి సాధారణ పెట్రోల్, డీజిల్ కాకుండా.. 'ప్రీమియం' రకం ఇంధనాలపై భారీగా వడ్డన చేయడం గమనార్హం. పెరిగిన ఈ కొత్త ధరలు సోమవారం అర్థరాత్రి నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయని అధికారులు ప్రకటించారు.
ఎంత పెరిగింది? ఎక్కడెక్కడ ప్రభావం?
తాజా సవరణల ప్రకారం, ప్రీమియం డీజిల్ ధర లీటరుకు సుమారు రూ. 1.50 మేర పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అందించే ఎక్స్ట్రా గ్రీన్ ప్రీమియం డీజిల్ ధర గతంలో రూ. 91.49 ఉండగా, అది ఇప్పుడు రూ. 92.99కి చేరుకుంది. ఇక పెట్రోల్ విషయానికి వస్తే, అత్యంత ఖరీదైన ఎక్స్పి100 (100 ఆక్టేన్) పెట్రోల్ ధర ఏకంగా రూ. 11 పెరిగి, రూ. 149 నుండి రూ. 160కి ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీ వంటి నగరాల్లో ప్రీమియం డీజిల్ ధర ప్రస్తుతం రూ. 95 నుంచి రూ. 96 మధ్య పలుకుతోంది.
వినియోగదారులపై పడే భారం ఇదే..
ప్రీమియం డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యవసాయ రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. సాధారణంగా ట్రాక్టర్లు, భారీ లారీలు అత్యాధునిక ఇంజన్లు కలిగిన కార్లలో మెరుగైన మైలేజ్ కోసం వాహనదారులు ఈ ప్రీమియం ఇంధనాన్ని వాడుతుంటారు. ధరలు పెరగడం వల్ల సామాన్య రైతులు, లారీ యజమానులు అదనపు ఖర్చులను భరించాల్సి వస్తుంది. ఇంజిన్ లైఫ్ పెరుగుతుందని ప్రీమియం వైపు మొగ్గు చూపే మధ్యతరగతి వాహనదారులు ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడ్డారు.
ధరల పెరుగుదలకు కారణాలు
చమురు కంపెనీల విశ్లేషణ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వాతావరణ మార్పుల కారణంగా చమురు ఉత్పత్తి, సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా లేకపోవడం వల్ల ఈ భారాలను వినియోగదారులకు బదిలీ చేయక తప్పడం లేదని వారు చెబుతున్నారు. అయితే సామాన్యులు మాత్రం ఏప్రిల్ 1 'ఏప్రిల్ ఫూల్' రోజున ఇలాంటి వార్త వినడం నిజంగా చేదు అనుభవమేనని వాపోతున్నారు.
ఇతర రంగాల్లోనూ మార్పులు
కేవలం ఇంధన ధరలే కాకుండా, నేటి నుంచి కొత్త ఐటీ నిబంధనలు, గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల రద్దు వంటి కీలక నిర్ణయాలు కూడా అమల్లోకి వచ్చాయి. బంగారం ధరలు కూడా మరోసారి రికార్డు స్థాయికి చేరడంతో సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతోంది. రాబోయే రోజుల్లో రవాణా చార్జీలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Be the first to react