జీఎంఆర్, మాన్సాస్ ఎడ్యు సిటీ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రాష్ట్రాభివృద్ధికి అనేక మంది కలిసి కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థల నిర్వాహకులు, పెట్టుబడిదారుల సహకారంతోనే ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నాన్ని ఐటీ, విద్యా, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అందుకే దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ విశాఖ వైపే చూస్తున్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా పేరొందిన జీఎంఆర్ అధినేత జీవన ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదగడం ప్రతి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
నారా లోకేష్ మాట్లాడుతూ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ ఎలా అభివృద్ధి చేసిందో దేశమంతా చూస్తోందని గుర్తు చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన విజన్తో ముందుకు వెళ్లారని, అలాంటి విజన్ లేకపోతే ఇంతటి మౌలిక వసతుల అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని అన్నారు. అయితే ప్రతి విజనరీని కొంతమంది విజన్ లెస్ పీపుల్స్ ఎగతాళి చేస్తారని విమర్శించారు. కానీ కాలమే నిజాన్ని నిరూపిస్తుందని, దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలే రాష్ట్రానికి దీర్ఘకాల లాభాలను ఇస్తాయని స్పష్టం చేశారు.
ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ యువతకు అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ తెలిపారు. ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్లో 25 శాతం మంది తెలుగువాళ్లే ఉండాలన్నది తమ ఆశయమని చెప్పారు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా, నైపుణ్యాభివృద్ధి సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని అన్నారు. జీఎంఆర్–మాన్సాస్ ఎడ్యు సిటీ వంటి ప్రాజెక్టులు యువత భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉన్నాయని, ఇవి కేవలం విద్యనే కాదు ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తాయని వివరించారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
గతంలో పరిశ్రమల కోసం 99 పైసలకు భూములు కేటాయిస్తామన్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారని నారా లోకేష్ గుర్తు చేశారు. భూములిస్తే సరిపోతుందా, కంపెనీలు వస్తాయా అంటూ హేళన చేసినవారే, ఇప్పుడు కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి రావడాన్ని చూస్తున్నారని అన్నారు. ఆ ఒక్క నిర్ణయం వల్లే ఐటీ రంగంలో రాష్ట్రానికి కొత్త దిశ లభించిందని పేర్కొన్నారు. రాబోయే వంద రోజుల్లోనే విశాఖకు కనీసం మరో రెండు ప్రముఖ కంపెనీలను తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టడం తమ బాధ్యత అని, మంచి మనస్సుతో, స్పష్టమైన విజన్తో ముందుకు సాగితే ఏ పని అయినా సాధ్యమేనని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.