Amaravati Infrastructure: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రధాన రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే N15 రహదారి పనులు పతాక స్థాయికి చేరుకున్నాయి. సుమారు 8.55 కిలోమీటర్ల మేర సాగే ఈ భారీ రహదారి నిర్మాణ బాధ్యతలను ప్రముఖ సంస్థ 'ఎన్సీసీ' చేపట్టింది. గొర్రుపాలెం నుంచి శాకమూరు వరకు, పొట్టి శ్రీరాములు స్మృతివనం మీదుగా సాగే ఈ రోడ్డును మొత్తం ఆరు వరుసల్లో అత్యంత ఆధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. ఈ రహదారి ప్రత్యేకత ఏమిటంటే, ఇది అమరావతిలోని E1 నుంచి E8 వరకు ఉన్న 8 ప్రధాన జంక్షన్లను కలుపుతూ సాగుతుంది.
ప్రస్తుతం నిర్మాణ పనుల విషయానికి వస్తే, గతంలో కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న పాత రోడ్డును పూర్తిగా తొలగించి, కొత్తగా రోడ్డు వేస్తున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఒకవైపు తారు వేసే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు మరో 2 కిలోమీటర్ల మేర రెండో వైపు తారు పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, భూమి మట్టం నుంచి సుమారు 1.5 మీటర్ల ఎత్తులో పటిష్టమైన బేస్మెంట్తో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వరద ముప్పు ఉన్నా రోడ్డు దెబ్బతినకుండా ఉండనుంది.
ఈ N15 రోడ్డు కేవలం వాహనాల రాకపోకలకే పరిమితం కాకుండా, గ్లోబల్ సిటీ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. రహదారికి ఇరువైపులా ఎలక్ట్రికల్ కేబుల్స్ కోసం ప్రత్యేక డక్టులు, డ్రైనేజీ వ్యవస్థ స్ట్రోమ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం మ్యాన్హోల్స్ను నిర్మిస్తున్నారు. వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా ఉండేందుకు ప్రతి 15 మీటర్లకు ఒక చోట ప్రత్యేకంగా నీరు బయటకు వెళ్లే మార్గాలను ఏర్పాటు చేశారు. ఈ నీరు నేరుగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలోకి వెళ్లేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు. దీనివల్ల రోడ్డు ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నారు.
రహదారి అందాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్డు మధ్యలో 8 మీటర్ల వెడల్పుతో సెంట్రల్ మీడియన్ వదిలారు. ఇందులో పచ్చని మొక్కలను పెంచడం ద్వారా అటు ఆహ్లాదాన్ని, ఇటు రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాల వెలుతురు (Glare) నేరుగా పడకుండా రక్షణను కల్పిస్తారు. అలాగే, రోడ్డుకు ఇరువైపులా పాదచారుల కోసం వాకింగ్ ట్రాక్స్ సైక్లింగ్ చేసే వారి కోసం ప్రత్యేక ట్రాక్స్ను నిర్మిస్తున్నారు. దీనివల్ల కాలుష్య రహిత ప్రయాణానికి ప్రాధాన్యత లభిస్తుంది.
సాంకేతికత విషయానికి వస్తే, రోడ్డు అంచున ఉండే 'కర్బ్' నిర్మాణానికి అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఐ-కర్బ్ ఎల్-కర్బ్ లను ఏకధాటిగా కాంక్రీట్ యంత్రాలతో వేయడం ద్వారా పనులు వేగంగా అవ్వడమే కాకుండా, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తోంది. ఇప్పటికే 5 కిలోమీటర్ల మేర ఎలక్ట్రికల్ డక్టుల పనులు పూర్తయ్యాయని, వీటిని నేరుగా సమీపంలోని ఎల్పీఎస్ (LPS) లేఅవుట్లకు అనుసంధానిస్తామని అధికారులు వెల్లడించారు.
మొత్తం 8.55 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 3 కిలోమీటర్ల మేర పనులు పెండింగ్లో ఉన్నాయి. అక్కడ నిలిచిన నీటిని తొలగించి పునాది పనులను వేగవంతం చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో తారు వేసే ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే అమరావతిలో రవాణా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడటమే కాకుండా, రాజధాని రూపురేఖలే మారిపోతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.