పీపీఏల రద్దుతో పారిశ్రామిక రంగానికి తీరని దెబ్బ
విద్యుత్ శాఖకు కోట్లాది రూపాయల నష్టం
ఏఐ సాంకేతికతతో ఆధునిక విద్యుత్ రంగం
Andhra Pradesh Power Sector: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మంగళవారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ ఐదేళ్ల పాలనలో విద్యుత్ శాఖను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మంత్రి మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) ఏకపక్షంగా రద్దు చేయడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ఈ చర్యల వల్ల అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ పరువు పోవడమే కాకుండా, కొన్ని విదేశీ కంపెనీలు సాక్షాత్తూ ప్రధానమంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేసిన ఉదంతాలను ఆయన ప్రస్తావించారు. "రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం సురక్షితం కాదని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి" అని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయని, ప్రజలపై భారీగా విద్యుత్ భారాలు పడ్డాయని మంత్రి వివరించారు. అస్తవ్యస్తమైన పాలన వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇప్పుడు ఆ నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ చార్జీలను 'ట్రూ డౌన్' చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన గర్వంగా ప్రకటించారు. నాణ్యమైన విద్యుత్ అందిస్తూనే, సామాన్యుడిపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆధునిక ఐటీ కృత్రిమ మేధస్సు (AI) పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాతావరణ పరిస్థితులను ముందే అంచనా వేస్తామని, తద్వారా విద్యుత్ డిమాండ్ను సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఆయన వివరించారు. వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి ఎక్కడ ఎంత విద్యుత్ అవసరమో ముందే తెలుసుకోవడం ద్వారా వృధాను అరికట్టవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు బ్యాటరీ స్టోరేజ్, స్వాపింగ్ విధానం, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన కరెంటును ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో రాష్ట్రాన్ని వీడి వెళ్ళిన పెట్టుబడిదారులలో నమ్మకాన్ని కలిగించి, తిరిగి ఏపీని పారిశ్రామికంగా నంబర్ వన్ స్థానంలో నిలబెడతామని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.