Iran Israel War 3 Day: మిడిల్ ఈస్ట్లో రాజుకున్న నిప్పు ఇప్పుడు గ్లోబల్ వార్గా మారుతోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ పోరు మూడో రోజుకు చేరేసరికి, యుద్ధ భూమి సరిహద్దులు దాటి ఐరోపాను తాకడం గమనార్హం. ముఖ్యంగా లెబనాన్లోని ఇరాన్ ప్రాక్సీ గ్రూప్ హెజ్బుల్లా, సైప్రస్లోని బ్రిటన్ మిలిటరీ బేస్పై డ్రోన్ దాడులకు దిగడం ఒక కీలక మలుపుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ దాడి ద్వారా యుద్ధం కేవలం ఆసియాకే పరిమితం కాదని, యూరోపియన్ భూభాగంపై కూడా ప్రతీకార దాడులు ఉంటాయని ఇరాన్ స్పష్టమైన సంకేతాలిచ్చిందని విశ్లేషిస్తున్నారు.
యూరప్ ఆందోళన వెనుక వ్యూహం ఏమిటి?
నిన్నటి వరకు తటస్థంగా ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యూకే పీఎం కైర్ స్టార్మర్, జర్మనీ ఛాన్సలర్ మర్జ్ ఒకే వేదికపైకి వచ్చి సంయుక్త ప్రకటన విడుదల చేయడం వెనుక పెను ముప్పు దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచం అనూహ్యంగా మారింది అని వారు అనడం వెనుక, అమెరికాతో కలిసి ఇరాన్పై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవ్వడమే ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. పారిస్, బెర్లిన్ వంటి నగరాలు కూడా ఇరాన్ మిస్సైల్స్ పరిధిలో ఉన్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో, యూరప్ తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవాలని నిర్ణయించుకోవడం వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.
గల్ఫ్ ఎకానమీపై పిడుగు చమురు రాజకీయాల సంక్షోభం
గల్ఫ్ దేశాల భద్రతపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్, అబుదాబి వంటి సురక్షిత ప్రాంతాల్లో సైతం డ్రోన్ల సవ్వడి వినిపించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించింది. బెహరీన్లోని అమెరికా నావల్ బేస్ లక్ష్యంగా జరిగిన దాడులు, సౌదీ అరాంకో ప్లాంట్ మూసివేత, ఖతార్ గ్యాస్ ప్లాంట్లపై దాడులను గమనిస్తే.. ఇరాన్ వ్యూహాత్మకంగా ప్రపంచ ఇంధన సరఫరాను దెబ్బకొట్టాలని చూస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. దీనివల్ల గ్యాస్ ధరలు 35% పెరగడం కేవలం ఆరంభం మాత్రమేనని, ఇది ప్రపంచవ్యాప్త మాంద్యానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇజ్రాయెల్ 'త్రీ-ఫేస్' ఆపరేషన్ ఇరాన్ ఉక్కిరిబిక్కిరి
వ్యూహాత్మక కోణంలో చూస్తే, ఇజ్రాయెల్ అత్యంత పకడ్బందీగా ఇరాన్ను దెబ్బతీస్తోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు
మొదటి దశ: ఇరాన్ అగ్రనేతలను, పొలిటికల్ ఆర్కిటెక్టులను లక్ష్యంగా చేసుకోవడం.
రెండో దశ: ఇరాన్ గగనతలంపై పట్టు సాధించి, వారి రక్షణ కవచాలను ఛేదించడం.
మూడో దశ: ప్రస్తుతం జరుగుతున్న క్షిపణి కేంద్రాలు, అణు ప్లాంట్లపై దాడులు. ఇస్వహాన్ న్యూక్లియర్ ప్లాంట్ దెబ్బతినడం వల్ల ఇరాన్ అణు సామర్థ్యం దశాబ్దాల కాలం వెనక్కి పోయిందని అంచనా వేస్తున్నారు.
చైనా వైఖరి సూపర్ పవర్ ముసుగులో 'పేపర్ టైగర్'?
అంతర్జాతీయ వేదికపై చైనా ప్రవర్తనను రాజకీయ విశ్లేషకులు ఎండగడుతున్నారు. ఇరాన్ నుంచి 90% చమురు పొందుతున్న చైనా, తన ఆలీ ఆపదలో ఉన్నప్పుడు కేవలం ప్రకటనలకే పరిమితమవ్వడం ఆశ్చర్యకరం. ఒక్క యుద్ధ నౌకను కూడా పంపలేకపోవడం ద్వారా చైనా సైనిక శక్తి కేవలం కాగితాలకే పరిమితమని, అది అమెరికా అగ్రెషన్ను అడ్డుకోలేదని స్పష్టమైందని విశ్లేషిస్తున్నారు. రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోవడంతో, ప్రస్తుతం ప్రపంచం మళ్ళీ 'యూనిపోలార్' దిశగా వెళ్తోందని నిపుణుల అభిప్రాయం.
జెరూసలెం కేంద్రంగా 'వరల్డ్ వార్ 3'?
చాలా కాలంగా యుద్ధ నిపుణులు హెచ్చరిస్తున్నట్లుగా, జెరూసలెం వివాదమే మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు కాబోతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసేలా పరిస్థితులు కల్పించడం, అగ్రరాజ్యాలు నేరుగా రణరంగంలోకి దిగడం చూస్తుంటే పరిస్థితి చేజారిపోయిందని అనిపిస్తోంది. రాబోయే కొద్ది వారాలు ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైనవిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.