నేతన్నల స్కిల్ పెంచేలా శిక్షణిస్తాం..
23 నెలల కాలంలో ఆప్కో ద్వారా రూ.190 కోట్ల వస్త్రాల విక్రయం..
అమరావతి: రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. నేతన్నలకు ఆర్థికంగా మరింత బలం చేకూర్చేందుకు చేనేత సహకార సంఘాల దగ్గరకే వెళ్లి వస్త్రాలను కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశమై వారి సమస్యలు, వస్త్రాల కొనుగోలు, మార్కెటింగ్ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేనేత కళాకారులు గర్వంగా జీవించే పరిస్థితులు తీసుకురావడమే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యమన్నారు. నేతన్నలకు 365 రోజుల ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత 23 నెలల్లో ఆప్కో ద్వారా రూ.190 కోట్ల విలువైన చేనేత వస్త్రాల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు.
చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 90 శాతం సబ్సిడీతో మగ్గం పనిముట్లు, నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలో “నేతన్న భరోసా” పథకం ప్రారంభించి ప్రతి అర్హ కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అలాగే చేనేత కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకురానున్నట్లు చెప్పారు.
చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్కు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికల ద్వారా అమ్మకాలు పెంచుతున్నామని తెలిపారు. ప్రస్తుతం 6,770 చేనేత ఉత్పత్తులను 40 ఆప్కో షోరూమ్ల ద్వారా ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న చేనేత ఎగ్జిబిషన్లకు మంచి స్పందన వస్తోందన్నారు.
ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో జరిగే మహానాడు సందర్భంగా ప్రత్యేక చేనేత ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గతంలో టీటీడీ బ్రహ్మోత్సవాలు, మహానాడులో కూడా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి మంచి ఆదరణ పొందామని గుర్తుచేశారు.
చేనేత వస్త్రాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి సవిత స్పష్టం చేశారు. అధికారులు ఇచ్చిన ఇండెంట్కు అనుగుణంగా, ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టు వస్త్రాలు తయారు చేసి ఆప్కోకు విక్రయించాలని సూచించారు. రెడీమేడ్ చేనేత దుస్తుల తయారీపై కూడా శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నేతన్నల నైపుణ్యాలను పెంచేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
ఆప్కో చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రూ.20 కోట్లకు పైగా ఆర్డర్ వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. టీటీడీ కోసం కండువాలు, దుశ్శాలువాలు, చీరలు, దుప్పట్టాలు, బ్లౌజ్లు తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. వాటిపై శంకు చక్రాలతో పాటు “ఓం నమో వెంకటేశాయ” ముద్రించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న చేనేత కార్మికులకు ఈ ఆర్డర్లలో భాగస్వామ్యం కల్పిస్తామని పేర్కొన్నారు.
చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ విస్తృత ప్రచారం చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. నేతన్నల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.
సమావేశంలో జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి పాల్గొన్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు తీసుకొచ్చిన వస్త్రాలను మంత్రి పరిశీలించి వాటి తయారీ, ధరలు, ప్రాంతాల గురించి తెలుసుకున్నారు. చేనేత కార్మికులు కూడా తమ సమస్యలను మంత్రికి వివరించి, ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.