రైతు నాయకుడు చరణ్ సింగ్ సేవలను స్మరించిన దేశ నాయకులు..
చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన అమిత్ షా, ఓం బిర్లా..
భారత మాజీ ప్రధాని, రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా దేశ నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఉప రాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఉప రాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ మాట్లాడుతూ… చౌదరి చరణ్ సింగ్ దూరదృష్టి కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. గ్రామీణ భారత అభివృద్ధి, రైతు సమాజ అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, గ్రామీణాభివృద్ధి, రైతు వర్గాల సాధికారత కోసం ఆయన చూపిన అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ… చరణ్ సింగ్ జీవితమంతా రైతులు, కార్మికులు, గ్రామాల అభివృద్ధికే అంకితమైందన్నారు. రైతుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, గ్రామీణాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటుందని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భారత రత్న చౌదరి చరణ్ సింగ్కు నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమర కాలం నుంచి అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. రైతులు ఆర్థికంగా బలపడేలా, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేలా చరణ్ సింగ్ చూపిన మార్గం దేశానికి కొత్త దిశను ఇచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు.
దేశ రాజకీయాల్లో రైతు స్వరాన్ని బలంగా వినిపించిన నాయకుడిగా చౌదరి చరణ్ సింగ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.