హరామి నాలా ప్రాంతాన్ని సందర్శించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా..
కచ్లో బీఎస్ఎఫ్ భద్రతా ఏర్పాట్లపై అమిత్ షా సమీక్ష..
కచ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ కీలక పర్యటన చేపట్టనున్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హరామి నాలా మరియు క్రీక్ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ ప్రాంతాలు భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.
ఈ సందర్భంగా సరిహద్దు భద్రత కోసం బీఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను అమిత్ షా సమీక్షించనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎదురవుతున్న భద్రతా సవాళ్లపై ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. అనంతరం బోర్డర్ అవుట్పోస్ట్ G-7ను ప్రారంభించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించనున్నారు.
తర్వాత OP టవర్ 1170లోని కంట్రోల్ రూమ్ను సందర్శించి, హరామి నాలా ప్రాంతంలో బోట్ టూర్ కూడా చేయనున్నారు. సరిహద్దు ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ జెట్టీ పాయింట్ వద్ద వృక్షారోపణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
రోజు చివర్లో భుజ్లోని బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్క్వార్టర్స్లో సరిహద్దు సమస్యలపై ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
గత ఆరు నెలల్లో అమిత్ షా కచ్ ప్రాంతాన్ని సందర్శించడం ఇది రెండోసారి కావడం విశేషం. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ రైజింగ్ డే జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన భుజ్కు వచ్చిన విషయం తెలిసిందే.