భారత ఆత్మగౌరవానికి సోమనాథ్ ఆలయం శాశ్వత చిహ్నం: చంద్రబాబు..
భారతీయ సంస్కృతి, నాగరికతకు ప్రతీకగా సోమనాథ్ ఆలయం..
సోమనాథ్ అమృత్ మహోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రజలకు, భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం అనేది విశ్వాసాలను గౌరవించే పవిత్ర భూమి అని ఆయన పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు దేశాన్ని ఏకం చేసే గొప్ప శక్తిగా నిలుస్తున్నాయని చెప్పారు.
సోమనాథ్ ఆలయం భారతదేశ నాగరికతకు, ఆత్మగౌరవానికి శాశ్వత చిహ్నమని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నో దాడులు, విధ్వంసాలను ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ పునర్నిర్మించబడిన ఈ ఆలయం భారతీయుల అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని వివరించారు. ఆలయ పునర్నిర్మాణానికి అంకితభావంతో కృషి చేసిన మహనీయుల త్యాగాలు, భక్తిని ఈ సందర్భంగా స్మరించుకోవాలని ఆయన అన్నారు.
దేశ అభివృద్ధితో పాటు వారసత్వ పరిరక్షణ కూడా సమానంగా ముఖ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. “వికాస్ భీ, విరాసత్ భీ” అనే భావనను ఎన్డీయే ప్రభుత్వం సమర్థంగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. సోమనాథ్ మహోత్సవం భారతీయుల ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు.