ఉదయాన్నే మన ఇళ్లలో ఎక్కువగా ఇడ్లీ, దోశ, పునుగులు వంటివి చేస్తుంటాం. వాటికి సైడ్ డిష్గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీ వంటివి చేస్తారు. కానీ ప్రతిరోజూ ఇవే చట్నీలు తింటూ విసుగొస్తే, ఒకసారి కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ (నువ్వుల పచ్చడి)ని తప్పక ప్రయత్నించాలి. ఈ పచ్చడికి ఘుమఘుమలాడే సువాసన, కమ్మని రుచి, ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కలిపి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. సాధారణంగా నువ్వులను మనం లడ్డూలు, మురుకులు వంటి పిండివంటలలో వాడుతాం కానీ, ఈ చిన్న గింజలతో చట్నీ చేస్తే అది ఎంత రుచిగా ఉంటుందో ఒక్కసారి రుచి చూస్తే తెలుస్తుంది.
ఈ కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ తయారీలో కావాల్సిన పదార్థాలు సులభంగా లభిస్తాయి — నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, చిటికెడు చక్కెర, ఉప్పు, అలాగే తాలింపు కోసం నూనె, ఆవాలు, కరివేపాకు వంటివి. ఈ చట్నీకి ప్రత్యేకత ఏమిటంటే — దీనికి ఎక్కువ తాలింపు అవసరం లేదు. తక్కువ సమయంలో సిద్ధమవుతుందికావడంతో ఉదయపు బ్రేక్ఫాస్ట్కు ఇది బెస్ట్ ఆప్షన్.
ముందుగా ఒక పాన్లో నువ్వులను మధ్యస్థ మంటపై సువాసన వచ్చే వరకు వేయించాలి. నువ్వులు రంగు మారగానే దించేసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, కొత్తిమీర, చక్కెర, ఉప్పు వేసి ముందుగా నీళ్లు పోయకుండా ఒకసారి రుబ్బాలి. తర్వాత చల్లారిన నువ్వులను వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి.
ఈ పచ్చడికి చివరగా తాలింపు ఇస్తే రుచి మరింత పెరుగుతుంది. ఒక చిన్న పాన్లో నూనె వేసి వేడి చేసిన తర్వాత ఆవాలు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, తుంచిన ఎండు మిరపకాయలు వేసి కాసేపు వేయించి, ఈ తాలింపును పచ్చడిలో కలపాలి. అలా కలిపిన తర్వాత పచ్చడి సిద్ధం.
తాజాగా తయారైన ఈ ఉచేలు చట్నీని వేడివేడి ఇడ్లీ, దోశ, ఊతప్పం లేదా పునుగులతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అంతేకాక, జొన్న రొట్టెలు లేదా రాగి సంకటి వంటి సంప్రదాయ ఆహారాలతో కూడా ఇది బాగా సరిపోతుంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న నువ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి, ఇది రుచికరమైనదే కాకుండా ఆరోగ్యకరమైన చట్నీ కూడా.