తమిళనాడుకు కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు..
టీవీకే చీఫ్ విజయ్కి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం..
చెన్నై: తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, పోలీసు నిఘాను మరింత పెంచాలని సూచించాయి.
ప్రత్యేకంగా రద్దీ ప్రాంతాలు, రాజకీయంగా సున్నితమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర నిఘా సంస్థలు రాష్ట్ర అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో భద్రతా వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.
ఇదే సమయంలో టీవీకే చీఫ్ విజయ్ కు మరో షాక్ తగిలింది. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెనక్కి తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్ భద్రతకు సంబంధించిన అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.
మరోవైపు రాష్ట్రంలో “రిసార్ట్ రాజకీయాలు” కూడా వేడెక్కాయి. టీవీకే ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక రిసార్ట్లో మకాం వేసినట్లు సమాచారం. అదే దారిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కూడా రిసార్ట్కు తరలించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మద్దతు విషయంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకుండా పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
టీవీకే ఎమ్మెల్యేల కీలక సమావేశం కాసేపట్లో జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు, మెజారిటీ నిరూపణ, ఇతర పార్టీల మద్దతు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ కూడా ఇవాళ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.
ఇటీవల స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆరు నెలల వరకు అడ్డుకోమని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. అదే సమయంలో కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇప్పటికీ విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం కొనసాగుతోంది.
ఈ పరిణామాలన్నింటితో తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు? అనే ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.