ప్రముఖ పారిశ్రామిక వేత్త చుక్కపల్లి సురేష్ గారి ఆర్ధిక సహకారంతో అభివృద్ధి..
దహన సంస్కారాల కోసం వచ్చే వారికి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు..
మచిలీపట్నం: మచిలీపట్నం బైపాస్ రోడ్డులో ఉన్న శ్మశాన వాటికకు కొత్త రూపు తీసుకొస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చుక్కపల్లి సురేష్ ఆర్థిక సహకారంతో అక్కడ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతిమ సంస్కారాలకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. కరోనా సమయంలో సరైన సదుపాయాలు లేక ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ, ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని సుమారు 16 ఎకరాల శ్మశాన వాటిక గత కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణలకు గురైందని, ఇప్పుడు దాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన చుక్కపల్లి సురేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శ్మశాన వాటికలో క్రిమేషన్ కేంద్రాలు, వెయిటింగ్ హాల్స్, భౌతిక దేహాలను ఉంచేందుకు ప్రత్యేక నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, రోడ్లు, డ్రైనేజీలు, స్నానానికి అవసరమైన సదుపాయాలను మున్సిపాలిటీ నిధులతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
మంగళగిరి, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో మొదటిసారిగా ఈ తరహా ఆధునిక శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ శ్మశానాన్ని ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గంలోని ఇతర శ్మశాన వాటికలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
దాతలు ముందుకు వస్తే వారితో కలిసి కమిటీ ఏర్పాటు చేసి, అన్ని శ్మశానాలను మెరుగుపరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జంగిల్ క్లియరెన్స్, రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తిచేసి ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.