ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ను, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య కేంద్రమైన విశాఖపట్నంతో అనుసంధానించే చారిత్రాత్మక ఎకనామిక్ కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ మెగా ప్రాజెక్టు పూర్తయితే, మూడు రాష్ట్రాల వాణిజ్య రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.
ప్రస్తుతం ఉన్న 12 గంటల సుదీర్ఘ ప్రయాణ సమయం కేవలం 5 గంటలకు తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టు కేవలం రహదారి విస్తరణ మాత్రమే కాదు, ఇది మూడు రాష్ట్రాల మధ్య సరికొత్త వాణిజ్య జీవనాడిగా మారనుంది.
మొత్తం 465 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ఆరు వరుసల (Six-lane) గ్రీన్ఫీల్డ్ హైవే వ్యయం దాదాపు ₹16,482 కోట్లుగా అంచనా వేశారు. ఈ కారిడార్ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి-26 మార్గంలో రాయ్పూర్-విశాఖపట్నం మధ్య దూరం 597 కిలోమీటర్లు ఉండగా, ఈ కొత్త మార్గం ద్వారా ఏకంగా 132 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దూరం తగ్గడం వల్ల ఇంధన ఆదాతో పాటు, రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గి, లాజిస్టిక్స్ రంగం బలోపేతం అవుతుంది.
ఈ కారిడార్ ఛత్తీస్గఢ్ మరియు ఒడిశాలోని పారిశ్రామిక ప్రాంతాలను నేరుగా సముద్ర తీరంతో అనుసంధానిస్తుంది. ఛత్తీస్గఢ్, ఒడిశాలోని పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాలు నేరుగా విశాఖపట్నం పోర్టుకు అనుసంధానం అవుతాయి.
ఇది చెన్నై-కోల్కతా జాతీయ రహదారికి కూడా అనుసంధానమవుతుంది. ఫలితంగా ఎగుమతులు వేగవంతమై, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. హైవే నిర్మాణం కేవలం రవాణా వ్యవస్థనే కాక, స్థానిక రైతుల మరియు ప్రజల జీవితాలను కూడా మెరుగుపరుస్తోంది.
ఈ ప్రాజెక్టు మొదలైన తర్వాత స్థానిక భూముల విలువలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక రైతు ఆనందం వ్యక్తం చేస్తూ, "గతంలో మా భూమి ఎకరం ₹15 లక్షలు పలికేది. ఈ హైవే పనులు మొదలయ్యాక దాని విలువ ₹1.5 కోట్లకు చేరింది. ఇక్కడి రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు" అని తెలిపారు.
విజయనగరం జిల్లా జామి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు మాట్లాడుతూ.. "హైవే కోసం 1.10 ఎకరాల భూమి ఇచ్చాను. నాకు మంచి పరిహారం అందింది. మిగిలిన భూమి విలువ కూడా గణనీయంగా పెరిగింది" అని వివరించారు.
రవాణాదారులు మరియు ట్రక్కు యజమానులకు ఈ కారిడార్ ఒక వరం లాంటిది. ట్రక్కు యజమాని విశాల్ మాట్లాడుతూ.. "గతంలో రాయ్పూర్ నుంచి విశాఖకు వెళ్లాలంటే ఒకటిన్నర రోజులు పట్టేది. ఇప్పుడు పగలు బయలుదేరితే రాత్రికే గమ్యం చేరుకోవచ్చు. దీనివల్ల డీజిల్ ఖర్చు, వాహనాల నిర్వహణ భారం బాగా తగ్గుతుంది" అని తెలిపారు.
ఈ కారిడార్ ద్వారా ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీలోని మారుమూల, గిరిజన ప్రాంతాలైన కంకేర్, కోరాపుట్, అరకు, రామభద్రపురం వంటి ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం మరియు అభివృద్ధి లభించనుంది.