దేశ భద్రతపై అప్రమత్తంగా భారత సైన్యం: జనరల్ ద్వివేది..
మహిళా క్యాడెట్ల ప్రతిభకు జనరల్ ద్వివేది ప్రశంసలు..
పుణే: దేశ భద్రత విషయంలో భారత సైన్యం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుందని, అవసరమైతే “ఆపరేషన్ సింధూర్ 2.0” చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని పుణే ఖడక్వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో 150వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, “ఆపరేషన్ సింధూర్” భారత సైనిక దళాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ఎలాంటి ప్రేరేపణ జరిగినా భారత్ ఖచ్చితత్వంతో, దృఢసంకల్పంతో స్పందించగలదని ఈ ఆపరేషన్ ద్వారా మరోసారి నిరూపితమైందని తెలిపారు. భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఇది ఒక ప్రమాణంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అలాగే, ఆపరేషన్ సింధూర్ దేశ సంకల్పానికి ప్రతిబింబమని, మూడు సైనిక దళాల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో ఈ ఆపరేషన్ వెల్లడించిందన్నారు. పట్టభద్రులవుతున్న క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, దేశ సేవలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు.
మారుతున్న భద్రతా పరిస్థితులకు అనుగుణంగా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం, పరిస్థితులకు తగినట్లుగా మారడం చాలా అవసరమని ఆర్మీ చీఫ్ అన్నారు. నిజమైన నాయకత్వం సైనికుల నమ్మకం, విశ్వాసంతో నిర్మితమవుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా మహిళా క్యాడెట్ల ప్రతిభను కూడా జనరల్ ద్వివేది ప్రత్యేకంగా ప్రశంసించారు. ధైర్యం, పట్టుదల, సైనిక నైపుణ్యం వంటి లక్షణాలకు లింగ భేదం ఉండదని అన్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన క్యాడెట్లు, వారి కుటుంబ సభ్యులు, శిక్షకులు మరియు సిబ్బందికి అభినందనలు తెలిపారు. అలాగే ఎన్డీఏ నినాదమైన “సేవా పరమో ధర్మః”ను జీవితంలో ఆచరణలో పెట్టాలని యువ అధికారులకు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా, 150వ ఎన్డీఏ కోర్సు కాన్వొకేషన్ కార్యక్రమానికి పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, సామాజిక సంస్కర్త డాక్టర్ కిరణ్ బేడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కోర్సులో మొత్తం 353 మంది క్యాడెట్లు పట్టభద్రులయ్యారు. వారిలో 236 మందికి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం డిగ్రీలు ప్రదానం చేసింది. ఇందులో 65 మంది సైన్స్, 112 మంది కంప్యూటర్ సైన్స్, 59 మంది ఆర్ట్స్ విభాగాల్లో పట్టాలు అందుకున్నారు. అదేవిధంగా స్నేహపూర్వక విదేశీ దేశాలకు చెందిన 21 మంది క్యాడెట్లకు కూడా డిగ్రీలు ప్రదానం చేశారు.