పేద విద్యార్థులకు కుల సంఘాల అండ అభినందనీయం : సవిత..
కూటమి పాలనలో ప్రభుత్వ విద్యకు కొత్త ఊపిరి..
గుంటూరు నగరంలోని దేవరసాయి కృష్ణ కళ్యాణ మండపంలో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నిర్వహించిన “భక్త కనకదాస ప్రతిభ పురస్కారాల” కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, విద్యతోనే జీవితంలో అత్యున్నత స్థానాలు సాధించవచ్చని చెప్పారు. పేద విద్యార్థులు కూడా కష్టపడి చదివితే పెద్ద లక్ష్యాలను చేరుకోగలరని అన్నారు. పిల్లల చదువుకు కుల సంఘాలు అండగా నిలవడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ తరహా సత్కారాలు విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతాయని చెప్పారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మంచి మార్పులు కనిపిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఇటీవల వచ్చిన టెన్త్, ఇంటర్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కొనియాడారు. పరీక్షల ముందు అమలు చేసిన వంద రోజుల ప్రణాళిక వల్ల మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, క్రీడలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. “తల్లికి వందనం”, “విద్యామిత్ర కిట్లు”, సన్నబియ్యంతో భోజనం వంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. బీసీ గురుకులాలు, హాస్టళ్లలో మెరుగైన ఆహారం, ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందిస్తున్నామని తెలిపారు. త్వరలో బీసీ గురుకులాల్లో స్పోర్ట్స్ కిట్లు కూడా అందజేస్తామని వెల్లడించారు.
విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల అభిరుచులను గౌరవిస్తూ ఉన్నత చదువులకు ప్రోత్సహించాలని అన్నారు. సమాజం గర్వించేలా ప్రతి విద్యార్థి ఎదగాలని ఆకాంక్షించారు.
కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొత్తం 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు అందజేశారు. టెన్త్ మరియు ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.3.30 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందించారు. మొదటి స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.5 వేల చొప్పున, రెండో స్థానాల్లో నిలిచిన వారికి రూ.3 వేల చొప్పున, మూడో స్థానాల్లో నిలిచిన వారికి రూ.2 వేల చొప్పున నగదు బహుమతులు ఇచ్చారు. మరో 120 మంది విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహక నగదు అందజేశారు.
అదే సమయంలో మంత్రి సవిత తన సొంత నిధులతో కూడా విద్యార్థులకు సహాయం చేశారు. తన తండ్రి మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.లక్ష అందజేశారు. అలాగే 200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
తన తండ్రికి విద్యపై ప్రత్యేక అభిరుచి ఉండేదని మంత్రి గుర్తుచేశారు. ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్లో 550కు పైగా మార్కులు సాధించిన 24 మందికి రూ.25 వేల చొప్పున సాయం అందించామని చెప్పారు. ఇంటర్లో 950కు పైగా మార్కులు సాధించిన 70 మంది విద్యార్థులకు రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలు ఇచ్చామని వివరించారు. బీటెక్ విద్యార్థులకు ల్యాప్టాప్లు కూడా అందిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమానికి వచ్చిన మంత్రి సవితకు కురమ సంక్షేమ సంఘ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురమ సంఘం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.