అమానవీయ ఘటనకు అత్యున్నత శిక్ష…
రక్షక భటులే భక్షకులైన వేళ…
చట్టం ముందు తలవంచిన ఖాకీలు…
Madurai Court: తమిళనాడులోని తూతుకుడి జిల్లా శాతంకోళం పోలీస్ స్టేషన్లో 2020లో జరిగిన అమానవీయ ఘటనపై మధురై సెషన్స్ కోర్టు కఠిన తీర్పునిచ్చింది. పోలీసుల చిత్రహింసల కారణంగా ప్రాణాలు కోల్పోయిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కేసులో ఏకంగా తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. స్వతంత్ర భారత చరిత్రలో ఒకే కేసులో ఇంతమంది పోలీసులకు మరణశిక్ష పడటం ఇదే ప్రథమం. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా అప్పట్లో పెద్ద దుమారం రేపింది.
ఈ విషాద ఘటన 2020 జూన్ నెలలో కోవిడ్ లాక్డౌన్ సమయంలో చోటుచేసుకుంది. రాత్రి 9 గంటల తర్వాత కూడా తన చిన్న కిరాణా షాపును తెరిచి ఉంచారనే నెపంతో 62 ఏళ్ల జయరాజ్ను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. నిజానికి ఆయన షాపును నిర్ణీత సమయం కంటే ముందే మూసివేసినప్పటికీ, పోలీసుల తీరును ప్రశ్నించినందుకు ఆయనపై కక్ష గట్టారు. తండ్రిని కాపాడుకోవడానికి వెళ్లిన 31 ఏళ్ల కొడుకు బెనిక్స్ను కూడా పోలీసులు అక్రమంగా నిర్బంధించి, లోపల బంధించారు.
పోలీస్ స్టేషన్ లోపల ఆ రాత్రంతా పోలీసులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు. తండ్రీకొడుకులిద్దరినీ అత్యంత క్రూరంగా, రక్తమొచ్చేలా చితకబాదారు. మరుసటి రోజు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు, గాయాలు కనిపించకుండా రక్తం ఓడుతున్న బట్టలను మార్పించి, ముదురు రంగు లుంగీలు కట్టించి తీసుకెళ్లారు. మేజిస్ట్రేట్ కూడా వారి పరిస్థితిని సరిగ్గా గమనించకుండానే రిమాండ్కు పంపారు. పోలీసుల దెబ్బలకు తాళలేక జూన్ 23, 24 తేదీల్లో తండ్రీకొడుకులిద్దరూ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.
ఈ కేసును మద్రాస్ హైకోర్టు సుమోటోగా స్వీకరించి, సీబీఐ విచారణకు ఆదేశించింది. పోలీసుల చిత్రహింసలను ధైర్యంగా కళ్ళకు కట్టినట్లు సాక్ష్యం చెప్పిన మహిళా కానిస్టేబుల్ రేవతి ఈ కేసులో కీలక మలుపుగా నిలిచారు. తోటి పోలీసులు ఎంత బెదిరించినా ఆమె వెనక్కి తగ్గకుండా సాక్ష్యం చెప్పడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. జడ్జి ముత్తుకుమారన్ ఈ కేసును విచారిస్తూ, పోలీసు వ్యవస్థలోని ఇలాంటి క్రూరత్వాన్ని అణచివేయాలంటే కఠిన శిక్షలే సరైన మార్గమని అభిప్రాయపడ్డారు.
కోర్టు కేవలం ఉరిశిక్షే కాకుండా మృతుల కుటుంబానికి రూ. 1.40 కోట్ల భారీ పరిహారాన్ని కూడా ప్రకటించింది. ఈ మొత్తాన్ని వేరే ఎక్కడి నుంచో కాకుండా, దోషులైన ఆ తొమ్మిది మంది పోలీసుల జీతాలు లేదా ఆస్తుల నుంచే వసూలు చేయాలని జడ్జి ఆదేశించడం విశేషం. ఈ తీర్పు సామాన్య ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడమే కాకుండా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసే వారికి ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది.