రైతులకు 'విద్యుత్' కష్టాలు ఉండొద్దు…
సీఎం చంద్రబాబు ఆదేశాలే మాకు శిరోధార్యం…
ఛార్జీల పెంపు ఉండదు.. అంతరాయం అస్సలు వద్దు…
APCPDCL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేడు విజయవాడలోని గుణదల విద్యుత్ సౌధలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వల్లనే నేడు ఈ రంగానికి ప్రజల్లో మంచి పేరు వచ్చిందని అభినందించారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ నూతన కార్యాలయం ద్వారా వినియోగదారులకు మరింత వేగంగా, పారదర్శకమైన సేవలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే, సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా చూడాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, ఆ దిశగా తాము నిరంతరం శ్రమిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలపై భార పడకుండా నాణ్యమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు విద్యుత్ శాఖ అధికారులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తీరును మంత్రి గొట్టిపాటి ప్రత్యేకంగా ప్రశంసించారు. తుపాన్లు, భారీ వర్షాల సమయంలో అతి తక్కువ సమయంలోనే విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రజల కష్టాలను తీర్చడంలో వారు చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా విద్యుత్ శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అధికారులు తమ శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.