Polavaram Update 2026: రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు దగ్గర ఈరోజు సందడి నెలకొంది. ప్రాజెక్టు పనుల్లో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం చేరుకుని పనులను పరిశీలించారు. రికార్డు సమయంలో ఈ గోడను పూర్తి చేసిన ఇంజనీర్లను, కార్మికులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. స్వయంగా అందరికీ స్వీట్లు తినిపించి, సంతోషాన్ని పంచుకున్నారు.
గత ప్రభుత్వంపై విమర్శలు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గతంలో టీడీపీ హయాంలో ఎంతో కష్టపడి కట్టిన డయాఫ్రమ్ వాల్ను జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల చేతులారా నాశనం చేసిందని మండిపడ్డారు. వరదలు వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే పాత గోడ దెబ్బతిందని, దాని వల్ల ప్రాజెక్టుకు తీరని నష్టం జరిగిందని ఆయన విమర్శించారు. అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియని స్థితిలో నాటి ముఖ్యమంత్రి ఉండేవారని ఎద్దేవా చేశారు.
440 రోజుల్లోనే పూర్తి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం పనులను గాడిలో పెట్టిందని మంత్రి తెలిపారు. 2025 జనవరి 18న ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఒక సవాల్గా తీసుకుని ప్రారంభించామని, నేటికి 1372 మీటర్ల పొడవైన ఈ గోడను పూర్తి చేశామని చెప్పారు. కేవలం 440 రోజుల్లోనే ఇంత పెద్ద పనిని పూర్తి చేయడం ఒక రికార్డు అని ఆయన వెల్లడించారు. జగన్ చేసిన తప్పిదం వల్ల కొత్తగా ఈ గోడ కట్టడానికి ప్రజల సొమ్ము సుమారు 1000 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
మాట తప్పిన జగన్
గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పిన మాటలను మంత్రి గుర్తు చేశారు. 2020లో వరదలకు గోడ దెబ్బతింటే.. 2021 జూన్ లోనో, డిసెంబర్ లోనో పూర్తి చేస్తానని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం కాలయాపన చేశారని దుయ్యబట్టారు. కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మాట ఇస్తే మడమ తిప్పదని, పనుల వేగమే దానికి నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు.
2027 లక్ష్యంగా ముందుకు
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడమే తమ లక్ష్యమని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ పూర్తయింది కాబట్టి, ఇక మెయిన్ డ్యామ్ పనులు ఊపందుకుంటాయని చెప్పారు. రైతుల కల నెరవేర్చడానికి సిఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తామని మంత్రి రామానాయుడు ప్రకటించారు.