- ప్రతి ఒక్కరూ తమకు ప్రతిభ ఉందని చెప్పుకుంటారు కానీ..
Kangana Ranaut: వివాదాస్పద అంశాలపై ఎప్పుడూ సూటిగా స్పందించే నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ భారతీయ సినీ పరిశ్రమలోని అంతర్గత విభేదాలను ఎత్తిచూపారు. బాలీవుడ్లో సూపర్స్టార్లు దర్శకులను వేధిస్తారని, వారిని బెదిరింపులకు గురిచేస్తారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ విషయంపై గళం విప్పిన ఆమె, హాలీవుడ్తో పోలిస్తే మన దగ్గర దర్శకులకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాలీవుడ్లో నటుల కంటే ఫిల్మ్మేకర్లకే ఎక్కువ ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని, కానీ భారతీయ చిత్ర పరిశ్రమలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన 'ధురంధర్ 2' చిత్రం సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ను ప్రశంసిస్తూ కంగనా ఒక సుదీర్ఘమైన నోట్ రాశారు. ఈ క్రమంలోనే భారతీయ సినీ పరిశ్రమలో దర్శకులు మరియు ఇతర సాంకేతిక నిపుణులు పడే కష్టానికి తగిన పారితోషికం గానీ, గుర్తింపు గానీ లభించడం లేదని ఆమె విమర్శించారు. "ధురంధర్ విజయంలో గొప్ప విషయం ఏమిటంటే, ఆదిత్య ధర్ ఒక సూపర్స్టార్ డైరెక్టర్గా స్థిరపడటం. హాలీవుడ్లో స్పీల్బర్గ్, టరంటినో, నోలన్ వంటి దర్శకులకు అక్కడి నటుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, కానీ మనం మన ఫిల్మ్మేకర్లకు తగినంత గౌరవం ఇవ్వడం లేదు" అని కంగనా వ్యాఖ్యానించారు. దర్శకులు తీవ్రమైన శ్రమకు గురవుతూ, తక్కువ వేతనం పొందుతూ సూపర్స్టార్ల చేతిలో వేధింపులకు గురవుతున్నారని ఆమె ఆరోపించారు.
దీని ఫలితంగానే నేటి యువతలో ఫిల్మ్మేకర్ లేదా సినిమాటోగ్రాఫర్ అవ్వాలని కలలు కనే వారిని తాను చూడలేకపోతున్నానని కంగనా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ప్రతిభ ఉందని చెప్పుకుంటారు కానీ, అందరూ నటులు కావాలనే కోరుకుంటున్నారని ఆమె విమర్శించారు. అయితే 'ధురంధర్ 2' విజయంతో ఏ హీరో కన్నా ప్రకాశవంతంగా వెలిగిపోతున్న ఒక సూపర్స్టార్ ఫిల్మ్మేకర్ ఆదిత్య ధర్ రూపంలో మనకు దొరికారన్నారు. ఆయన్ని చూసి ఎందరో యువకులు ప్రేరణ పొంది భవిష్యత్తులో గొప్ప దర్శకులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ పోస్టులో కేవలం దర్శకుడిని మాత్రమే ప్రశంసించి, చిత్ర కథానాయకుడు రణ్వీర్ సింగ్ను గానీ, ఇతర నటీనటులను గానీ కంగనా ట్యాగ్ చేయకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.