రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల విషయంలో అనుమతులు, భూకేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల కేబినెట్తో పాటు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదం పొందిన పలు కంపెనీలకు భారీ మొత్తంలో భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల స్థాపనతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి బలమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ భూకేటాయింపుల్లో భాగంగా విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ సంస్థకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని ఐపీ గుట్టపాడు క్లస్టర్లో 100.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ ఇక్కడ ఆధునిక ఫార్మాస్యూటికల్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను ఎకరాకు రూ. 30 లక్షల చొప్పున భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇదే ప్రాంతంలో ప్యూర్ ఎనర్జీ లిమిటెడ్కు కేటాయించిన 105.12 ఎకరాల భూమి ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా రద్దు చేసి, ఆ భూములను విరూపాక్ష ఆర్గానిక్స్కు కేటాయించింది. దీంతో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా అమలవుతున్నట్లు స్పష్టమవుతోంది.
అదేవిధంగా నెల్లూరు జిల్లా రాచర్లపాడు గ్రామంలో ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్ కంపెనీకి 2,776.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ ఇక్కడ రూ. 870 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ లార్జ్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనుంది. ఈ పార్క్ ద్వారా సుమారు 70 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ స్థాయిలో పరిశ్రమలు, అనుబంధ యూనిట్లు ఏర్పడటం వల్ల నెల్లూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఇది కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా అనకాపల్లి జిల్లాలోని కోడూరులో రాముకా గ్లోబల్ ఎకోవర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తొలి దశ ప్రాజెక్టు కోసం 45 ఎకరాల భూమిని రాయితీ ధరకు ప్రభుత్వం కేటాయించింది. ఎకరాకు రూ. 35 లక్షల చొప్పున భూమిని కేటాయిస్తూ, భూమి ధర చెల్లించేందుకు ఆరు నెలల గడువు పొడిగింపును (EOT) కూడా మంజూరు చేసింది. గతంలో అచ్యుతాపురం డీ-నోటిఫైడ్ ఏరియాలో కేటాయించిన భూములు లోతట్టు ప్రాంతంలో ఉండటం, రవాణా సదుపాయాలు లేవనే కారణాలతో రాముకా సంస్థ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సంస్థ అభ్యర్థన మేరకు కోడూరులో కొత్తగా భూములు కేటాయించారు. అదే ప్రాంతంలో ఎలీప్ సంస్థకు 31.77 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూమి చదును, అదనపు మౌలిక వసతుల ఖర్చులు ఆయా సంస్థలే భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.