ఏళ్ల తరబడి వీసా కోసం ఎదురుచూపులు.. భారత్ కు తిరుగు పయనం..
వైరల్ అయిన ఎన్నారై టెక్కీ సోషల్ మీడియా పోస్ట్..
అమెరికాలో పనిచేస్తున్న ఓ ఎన్నారై టెక్కీ తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏళ్ల తరబడి వీసా సమస్యలతో పోరాడుతూ అలసిపోయిన అతడు, ఇక భారత్కి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో, నెట్జన్ల మధ్య చర్చకు దారి తీసింది.
వీసా ఒత్తిడే కారణం
H-1B వీసా పై గత 5 సంవత్సరాలుగా పనిచేస్తూ, అంతకుముందు 3 సంవత్సరాలు OPTలో ఉన్న ఈ టెక్కీకి అమెరికాలో మొత్తం 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అయినప్పటికీ, ఆర్థికంగా ఇంకా స్థిరపడలేక పోయానని, ముఖ్యంగా వీసా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని అతడు తెలిపాడు.
“ఇక ఈ వీసా స్ట్రెస్ను భరించలేను. ఎంత పని చేసినా ముందుకు వెళ్తున్నాననే భావన లేదు,” అంటూ తన బాధను వ్యక్తం చేశాడు.ఈ ఏడాది ఏప్రిల్లో భారత్కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
అయితే భారత్కు వెళ్లిన తర్వాత సాధారణ 9-5 ఉద్యోగం చేయాలనే ఆసక్తి లేదని స్పష్టం చేశాడు. “కొత్తగా జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి?” అనే సందేహంతో ఇతరుల సలహాలు కోరాడు.
ఈ పోస్ట్కు సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వచ్చాయి. కొందరు ముందుగా మంచి సేవింగ్స్ ఉండాలని సూచిస్తే, మరికొందరు భారత్లో సెటిల్ అవ్వడం అంత సులభం కాదని చెప్పారు.
ఒకరు “కనీసం 4-5 కోట్ల లిక్విడ్ ఆస్తి ఉంటేనే రావడం మంచిది” అని సూచించగా, మరో వ్యక్తి “అమెరికా నుంచి 12 ఏళ్ల తర్వాత వచ్చాను.. అలవాటు పడటానికి సమయం పడుతుంది” అని తెలిపాడు.
మరో నెటిజన్ “టెక్ ఫీల్డ్లో ఉంటే మీ నెట్వర్క్ను ఉపయోగించుకుని కొత్త అవకాశాలు వెతకండి” అని సలహా ఇచ్చాడు. ఇంకొకరు కుటుంబ జీవితం, ట్రావెల్ వంటి విషయాలు ఒత్తిడిని తగ్గించవచ్చని సూచించారు.
ఈ ఘటన ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, విదేశాల్లో పనిచేస్తున్న అనేక మంది ఎన్నారైల పరిస్థితిని తెలియచేస్తుంది. బయటకు కనిపించే సౌకర్యాల వెనుక, వీసా సమస్యలు, ఒత్తిడి ఎంతగా ఉంటాయో ఈ సంఘటన చెబుతోంది.
చివరగా, తనకు తెలియని మార్గంలో అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నానని, “కొన్ని నిర్ణయాలు భయం కలిగించినా, అవే మన జీవితాన్ని మార్చగలవు” అనే భావనతో ముందుకు సాగుతున్నానని ఆ టెక్కీ వివరించాడు.