ఏపీ మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ వ్యాపార మ్యాగజైన్ 'బిజినెస్ టుడే' ఏటా ప్రకటించే 'మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' పురస్కారం ఆమెను వరించింది. వ్యాపార రంగంలో మహిళల నాయకత్వ పటిమను, సంస్థల అభివృద్ధిలో వారి పాత్రను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ విస్తరణ, బ్రాండ్ విలువను పెంచడం, రైతులతో అనుసంధానం కావడం వంటి అంశాల్లో బ్రాహ్మణి తనదైన ముద్ర వేశారు.
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, ఆధునిక సాంకేతికతను జోడిస్తూ సంస్థ పురోగతిలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కృషికి గుర్తింపుగానే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది.
ఈ విజయంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యను అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. "భర్తగా గర్విస్తున్నాను.
మాటల కన్నా పనితోనే సమాధానం చెప్పడం, నిశ్శబ్దంగా సంస్థలను నిర్మించడం బ్రాహ్మణి నాయకత్వ పటిమకు నిదర్శనం" అని ఆయన ప్రశంసించారు.
కుటుంబ, వ్యాపార బాధ్యతలను సమర్థంగా సమన్వయం చేస్తూ నారా బ్రాహ్మణి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పురస్కారం ఆమె వ్యక్తిగత విజయమే కాకుండా, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసింది.