ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా, ప్రముఖ వీడియో కమ్యూనికేషన్స్ సంస్థ 'జూమ్' ఉన్నతాధికారులతో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు.
ఈ భేటీలో జూమ్ సంస్థ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావాతో లోకేశ్ చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు.
రాష్ట్రంలోని అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డి), ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేశ్ వారిని కోరారు.
అలాగే, విశాఖపట్నంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూలమైన వ్యాపార వాతావరణం ఉందని లోకేశ్ వారికి తెలిపారు. ఈ సమావేశం వివరాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.