Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి..
Nara Lokesh: శక్తి యాప్, పోలీసుల అప్రమత్తత ఓ యువతిని అర్ధరాత్రి ఆపద నుంచి సురక్షితంగా బయటపడేశాయి. అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ బారి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థినిని కాపాడిన మంగళగిరి గ్రామీణ పోలీసులను మంత్రి నారా లోకేశ్ అభినందించారు.
- Politics: శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు..
- అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసిన వైనం..
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక పరిజ్ఞానం, పోలీసుల వేగవంతమైన స్పందన కలిసి ఒక యువతి ప్రాణాలను, గౌరవాన్ని కాపాడాయి. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం, ఆపదలో ఉన్న మహిళలకు ‘శక్తి’ యాప్ ఎంతటి భరోసాను ఇస్తుందో మరోసారి నిరూపించింది. బెంగళూరు నుంచి అర్ధరాత్రి విజయవాడ చేరుకుని, అక్కడి నుంచి ఆటోలో తన స్వస్థలమైన నంబూరుకు బయల్దేరిన ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ ఫణీంద్రకుమార్ కన్నేశాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఆటోను నెమ్మదిగా నడపడమే కాకుండా, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమెను భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే, ఆ యువతి ఏమాత్రం అధైర్యపడకుండా తన ఫోన్లోని ‘శక్తి’ యాప్ను ఆయుధంగా మలచుకుని ప్రాణాపాయం నుంచి బయటపడింది.
ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే ఆ విద్యార్థిని యాప్లోని ‘రెడ్ శక్తి’ ఎమర్జెన్సీ బటన్ను నొక్కడంతో, నిమిషాల వ్యవధిలోనే మంగళగిరి గ్రామీణ పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్సై వెంకట్ నేతృత్వంలోని బృందం లైవ్ లొకేషన్ ఆధారంగా నేషనల్ హైవేపై వెంబడించి, కాజా సమీపంలో ఆటోను అడ్డగించింది. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని, యువతిని సురక్షితంగా ఆమె ఇంటికి చేర్చారు. ఈ సంఘటనలో యువతి చూపిన సమయస్ఫూర్తిని, పోలీసుల అంకితభావాన్ని రాష్ట్రవ్యాప్తంగా పలువురు కొనిాడుతున్నారు. ఈ మేరకు గుంటూరు డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, మహిళలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఇలాంటి భద్రతా యాప్ల పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ మంగళగిరి పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. "సాంకేతికతను సామాన్యుల భద్రత కోసం ఎలా ఉపయోగించవచ్చో ఈ ఘటనే నిదర్శనం. ఆపదలో ఉన్న సోదరిని కాపాడటంలో శక్తి యాప్ మరియు మన పోలీసులు అద్భుతంగా పనిచేశారు" అని ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళా తన ఫోన్లో ఈ యాప్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని, ఇది ఒక కవచంలా రక్షణ ఇస్తుందని ఆయన సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన లోకేశ్, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని స్పష్టం చేశారు.
Be the first to react