Nara Lokesh: నాణ్యత లేని మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై మంత్రి లోకేష్ ఆగ్రహం!
Nara Lokesh Angry Poor Quality Food: పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా దేవునిచెరువు పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం వడ్డించినట్ల…
- విద్యార్థులు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి నా క్షమాపణలు..
- విచారణకు త్రిసభ్య కమిటి ఏర్పాటు చేశాం..
Nara Lokesh Angry Poor Quality Food: పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా దేవునిచెరువు పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం వడ్డించినట్లు వచ్చిన వార్తలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొన్న అసౌకర్యానికి ఒక బాధ్యతగల మంత్రిగా ఆయన క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రతి విద్యార్థికి ఉత్తమ సంరక్షణతో పాటు నాణ్యమైన సేవలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇలాంటి లోపాలు తలెత్తినప్పుడు కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఆహార నాణ్యత తక్కువగా ఉందన్న సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు చేపట్టిందని లోకేశ్ వివరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇప్పటికే బాధ్యులపై చర్యలు తీసుకున్నామని, సదరు భోజన ఏజెన్సీని తక్షణమే మార్చడంతో పాటు, పర్యవేక్షణలో విఫలమైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలుపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించడమే తమ లక్ష్యమని, ఇందులో ఎవరైనా రాజీపడితే వారెంతటి వారైనా చర్యలు తప్పవని లోకేశ్ హెచ్చరించారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో భోజన నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రత విషయంలో తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
Be the first to react