పశ్చిమాసియాలో యుద్ధం మొదలై నేటికి పదమూడు రోజులు గడుస్తున్నా, పరిస్థితి ఏమాత్రం కుదుటపడటం లేదు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా దాడులు ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ తుపా మోత ఆగడం లేదు. ఇప్పటికే సుమారు 1,200 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, ఆస్తి నష్టం అంచనాలకు అందడం లేదు. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, యుద్ధానికి ముగింపు పలకాలంటే తాము విధించిన మూడు ప్రధాన డిమాండ్లకు అగ్రరాజ్యం తలొగ్గాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ పెట్టిన మొదటి షరతు ప్రకారం.. అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ యొక్క సార్వభౌమాధికారాన్ని ఆ దేశానికి ఉన్న చట్టబద్ధమైన హక్కులను ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలి. ఇక రెండో డిమాండ్ ఆర్థికపరమైనది. ఈ 13 రోజుల యుద్ధంలో జరిగిన భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి బాధ్యత వహిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భారీగా నష్టపరిహారం చెల్లించాలని మసూద్ డిమాండ్ చేశారు. మూడోది l అత్యంత కీలకమైనది ఏమిటంటే.. భవిష్యత్తులో ఇరాన్పై మళ్లీ ఎలాంటి దాడులు జరగవని, దీనికి అంతర్జాతీయ సమాజం నుండి గట్టి హామీ ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ డిమాండ్లు నెరవేరితేనే శాంతి చర్చలకు తాము సిద్ధమని ఇరాన్ తెగేసి చెప్పింది.
ఈ యుద్ధ ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ప్రపంచానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూతపడటంతో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ఇంధన సంక్షోభం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రవాణా వ్యవస్థ దెబ్బతినడం, నిత్యావసరాల beధరలు పెరగడం వంటి ముప్పులు పొంచి ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. గూగుల్, ఐబీఎం వంటి టెక్ దిగ్గజాలను కూడా టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి భిన్నంగా ఉంది. బుధవారం ఆయన మాట్లాడుతూ.. "మేము ఇప్పటికే ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం" అంటూ ప్రకటించారు. యుద్ధం ముగిసిందని ఆయన చెబుతున్నప్పటికీ, అమెరికా సైన్యం మాత్రం ఇంకా అక్కడే మోహరించి ఉండటం గమనార్హం. తమ లక్ష్యం పూర్తిగా నెరవేరే వరకు సైన్యం వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఓవైపు ఇరాన్ చర్చల కోసం షరతులు విధిస్తుంటే, మరోవైపు అమెరికా తన మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో శాంతి చర్చలు ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం ఇరాన్ అంతర్గతంగా కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గతంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారని, ఆయన పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, అమెరికాకు కూడా ఈ యుద్ధం భారంగా మారుతోంది. కేవలం వారం రోజుల్లోనే సుమారు 94,500 కోట్ల రూపాయల ఖజానా ఖాళీ అయినట్లు సమాచారం. అటు ఇరాన్ పట్టుదల, ఇటు అమెరికా దూకుడు మధ్య పశ్చిమాసియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ యుద్ధ జ్వాలలు ఎప్పుడు చల్లారుతాయో, శాంతి ఎప్పుడు వెల్లివిరుస్తుందో వేచి చూడాలి.