- వెస్టిండీస్ క్రికెట్లో వెలుగు చూసిన అవినీతి కుంభకోణం..
- ఐపీఎల్లో గతంలో కేకేఆర్ తరఫున ఆడిన సియర్లెస్..
Cricket West Indies: అంతర్జాతీయ క్రికెట్లో అవినీతిని అరికట్టే విషయంలో ఐసీసీ (ICC) తన ఉక్కుపాదం మోపింది. వెస్టిండీస్కు చెందిన ఆల్రౌండర్ జావాన్ సియర్లెస్తో పాటు టైటాన్స్ జట్టు యజమాని చిత్రరంజన్ రాథోడ్, జట్టు అధికారి గ్రిఫిత్లు అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించి వారిపై అభియోగాలు మోపింది. ఈ ప్రక్రియ ముగిసే వరకు వీరి ముగ్గురినీ అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచి తక్షణమే తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. 2023-24 సీజన్లో జరిగిన బిమ్10 టోర్నమెంట్లో వీరు మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు (ఫిక్సింగ్) ప్రయత్నించారని, ఇతరులను కూడా అవినీతి మార్గంలోకి ప్రోత్సహించడమే కాకుండా దర్యాప్తు సంస్థలకు సహకరించలేదని ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ వెస్టిండీస్ (CWI) నిబంధనల ప్రకారం రాథోడ్పై మూడు, సియర్లెస్పై నాలుగు, గ్రిఫిత్పై నాలుగు అభియోగాలు నమోదయ్యాయి.
అయితే, జట్టు అధికారి గ్రిఫిత్పై పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. బిమ్10 టోర్నమెంట్ అంశాలతో పాటు, అంతర్జాతీయ మ్యాచ్లకు సంబంధించి జరుగుతున్న మరో విచారణలో సాక్ష్యాలను తారుమారు చేయడం ద్వారా దర్యాప్తును అడ్డుకున్నారనే అదనపు ఆరోపణను కూడా ఐసీసీ ఆయనపై మోపింది. ఈ అభియోగాలకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు వీరికి నిన్నటి నుంచి 14 రోజుల గడువు ఇచ్చారు. ఒకవేళ వీరు తమ తప్పును నిరూపించుకోలేకపోతే క్రికెట్ నుంచి శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది.
జావాన్ సియర్లెస్ ఒకప్పుడు వెస్టిండీస్ క్రికెట్లో మంచి గుర్తింపు ఉన్న ఆటగాడు. గతంలో వెస్టిండీస్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లోనూ రాణించాడు. ముఖ్యంగా 2018 ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో సభ్యుడిగా ఉండి భారతీయ అభిమానులకు కూడా చేరువయ్యాడు. అటువంటి పేరున్న ఆటగాడు ఇప్పుడు ఇలాంటి గంభీరమైన అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం ఆయన కెరీర్ను ప్రశ్నార్థకంలో నెట్టేసింది.