Vangalapudi Anitha: హెల్మెట్తోనే భద్రత.. అవగాహన కోసం హోం మంత్రి అనిత బైక్ ర్యాలీ!
Vangalapudi Anitha: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు కవచం..
బైక్ ర్యాలీలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత..
నక్కపల్లి: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
మంగళవారం ఉదయం ఎస్.రాయవరం మండలం తిమ్మాపురం ఫ్లైఓవర్ (అడ్డురోడ్డు) వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ, నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగింది. “సురక్షిత రోడ్లు - సురక్షిత జీవితం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ నడిపారు. సుమారు 500 మంది యువత, పోలీసు సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా వాహనదారులకు మంత్రి స్వయంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, ప్రాణం విలువైనదని, దాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి బైక్ కొనుగోలు చేసే వారు, ప్రాణాలను రక్షించే హెల్మెట్ కోసం మాత్రం వెనుకడుగు వేయడం సరికాదని పేర్కొన్నారు.
“మీరు లేకుండా మీ కుటుంబం కష్టాల్లో పడకూడదంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి” అని మంత్రి స్పష్టం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎవరైనా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు కూడా నిబంధనలు పాటించాల్సిందేనని, హెల్మెట్ లేకుండా కనిపిస్తే వారికి రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులకు ఆదేశించారు.
ఇటీవల ఈ నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగడం బాధాకరమని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే ఇలాంటి ఘటనలను తగ్గించవచ్చని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, పాయకరావుపేట ఇన్స్పెక్టర్ శంకర్రావు, నక్కపల్లి సీఐ రామకృష్ణ, ఇన్స్పెక్టర్ మురళి, స్థానిక ఎస్సైలు, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా “హెల్మెట్ ధరిద్దాం - ప్రాణాలు కాపాడుకుందాం” అనే సందేశంతో ర్యాలీ ముగిసింది.
Be the first to react