Minister Savitha: చేనేతల ఇళ్లలో వెలుగులు.. జీరో బిల్లులతో ఆనందంలో నేతన్నలు!

Minister Savitha: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకం చేనేత కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతోంది. గత నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వల్ల మే నెల విద్యుత్ బిల్లులు జీరోగా రావడంతో నేతన్నల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Minister Savitha: చేనేతల ఇళ్లలో వెలుగులు.. జీరో బిల్లులతో ఆనందంలో నేతన్నలు!

గత నెల 1 నుంచి ఉచిత విద్యుత్ అమలు..

జీరో పేమెంట్ తో మే నెల విద్యుత్ బిల్లుల రాక..

అమరావతి: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకం చేనేత కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతోంది. గత నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వల్ల మే నెల విద్యుత్ బిల్లులు జీరోగా రావడంతో నేతన్నల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, మగ్గం మీద నేసే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గం మీద నేసే వారికి 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షా నాలుగు వేల చేనేత కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకున్నారు.

ఇప్పటికే గ్రామాల్లో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ బిల్లులను పంపిణీ చేయగా, జీరో పేమెంట్ బిల్లులు అందుకున్న నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పడంతో కుటుంబాల్లో ఆనంద వాతావరణం నెలకొంది. చేనేత, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయడంతో ఈ పథకం విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా 50,252 మగ్గం నేతన్నలు, 6,995 మరమగ్గం కుటుంబాలు ఈ పథకం కింద అర్హులుగా గుర్తించబడ్డారు. మిగిలిన అర్హులకూ ఈ సదుపాయం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

ఉచిత విద్యుత్ వల్ల చేనేతలకు గణనీయమైన ఆర్థిక లాభం కలుగుతోంది. మగ్గం నేతన్నలకు నెలకు సుమారు రూ.720, ఏడాదికి రూ.8,640 లాభం ఉండగా, మరమగ్గం కుటుంబాలకు నెలకు రూ.1,800, ఏడాదికి రూ.21,600 వరకు ఆదా అవుతోంది. దీంతో నెల నెలా విద్యుత్ ఖర్చు తగ్గి ఆర్థికంగా ఉపశమనం కలుగుతోందని నేతన్నలు చెబుతున్నారు.

చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు రూ.4 వేల పెన్షన్, నూలుపై 15 శాతం సబ్సిడీ, ఏటా రూ.5 కోట్ల త్రిఫ్ట్ ఫండ్, ముద్ర పథకం కింద రూ.24.43 కోట్ల రుణాలు అందజేశారు. అలాగే ఆప్కో ద్వారా ఉత్పత్తుల అమ్మకాలు పెంచేందుకు ప్రదర్శనలు నిర్వహిస్తూ, ఆన్‌లైన్ ద్వారా వినియోగదారుల ఇళ్లకే చేనేత ఉత్పత్తులు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.

చేనేత కార్మికులకు గౌరవ జీవనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎస్ సవిత తెలిపారు. గతంలో ఎన్టీఆర్ చేనేత రంగానికి ఊపిరిపోసినట్లు, ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చేనేతలకు ఆర్థికంగా మేలు చేసే పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పెన్షన్లు, సబ్సిడీలు, ఆధునిక పరికరాలు, మార్కెటింగ్ అవకాశాలు—అన్నీ కలిపి నేతన్నలకు 365 రోజులు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

ఉచిత విద్యుత్ పథకం వల్ల తమ కుటుంబాలకు పెద్ద ఊరట లభించిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు చేనేతలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ పథకం చేనేతల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపుతోందని వారు ఆనందంగా చెబుతున్నారు.

Be the first to react

Latest