ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం కొత్తగా కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది. ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లా పలాసకు కూడా ఒక కేంద్రీయ విద్యాలయం కేటాయించారు. ఈ విద్యాలయాన్ని 2026 ఫిబ్రవరి నాటికి ప్రారంభించేలా అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పలాస ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
పలాస కేంద్రీయ విద్యాలయం కోసం ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆర్పీఎఫ్ బ్యారక్స్ను తాత్కాలికంగా వినియోగించనున్నారు. అవసరమైతే రైల్వే అతిథిగృహం, రైల్వే గృహాలను కూడా ఉపయోగించేందుకు అధికారులు పరిశీలన చేపట్టారు. విద్యాలయం ప్రారంభానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఈ క్రమంలో పలాస ఆర్డీవో జి. వెంకటేష్ స్థల పరిశీలన నిర్వహించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఈ.శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ వి.గిరి, టౌన్ ప్లానింగ్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది సూచన మేరకు రైల్వే అతిథిగృహంలో ఖాళీగా ఉన్న వసతి సముదాయాన్ని పరిశీలించగా, అది పూర్తిగా సరిపోదని గుర్తించారు.
దీంతో సమీపంలోని రైల్వే గృహాలను కూడా అధికారులు పరిశీలించారు. మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది నివాసానికి రైల్వే వైద్యుడి గృహాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఖాళీగా ఉండటంతో మహిళలకు అనుకూలంగా ఉందని సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఈ వివరాలను ఇంటి నెంబర్లతో సహా జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని ఆర్డీవో తెలిపారు.
డిసెంబరు నాటికి అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయం నిర్వహణకు అవసరమైతే అదనపు గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, కంప్యూటర్ ల్యాబ్లను తాత్కాలికంగా నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుండటంతో, పలాసలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి.