ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
ఆడబిడ్డలు సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో డ్వాక్రా స్థాపన..
నిమ్మాడ: మహిళలు సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో డ్వాక్రా సంఘాలు స్థాపించబడ్డాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన అన్నారు.
జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన 180 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOA)లకు మంత్రి 5జీ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని VOAలకు సూచించారు. డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం మీపై ఉంచిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని అన్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి ఒక్కరూ జాబ్ చార్ట్ ప్రకారం పని చేయాలని స్పష్టం చేశారు.
డ్వాక్రా సంఘాలు మహిళల ఆర్థిక పురోగతికి కీలకమని, ఈ వ్యవస్థపై తనకు ప్రత్యేక గౌరవం ఉందని మంత్రి పేర్కొన్నారు. మహిళలు పొదుపు సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదగడం గర్వకారణమని చెప్పారు.
అదే సమయంలో 5జీ ఫోన్ల ద్వారా VOAలు స్వయం సహాయక సంఘాల డేటా, పొదుపులు, రుణాల వివరాలు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని వేగంగా నిర్వహించగలరని వివరించారు. గ్రామీణ అభివృద్ధిలో డిజిటల్ దిశగా ఇది ఒక కీలక అడుగుగా నిలుస్తుందని తెలిపారు.
డ్వాక్రా ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేసినట్లు పేర్కొన్న మంత్రి, గ్రామ సంఘాలను మరింత బలోపేతం చేసి మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పి. భానుమతి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.