కాంగ్రెస్, మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయి..
మహిళలకు ద్రోహం చేయడం.. జాతి విద్రోహం..
మహిళా రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని దేశవ్యాప్తంగా ఆశలు నెలకొన్న సమయంలో కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకోవడం ద్రోహమని ఆయన విమర్శించారు.
మహిళలకు ద్రోహం చేయడం అంటే జాతికి ద్రోహం చేసినట్టేనని చంద్రబాబు స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతిలో మహిళలను గౌరవించి, అన్ని రంగాల్లో ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని, కానీ విపక్షాలు ఈ విలువలకు విరుద్ధంగా వ్యవహరించాయని అన్నారు.
మహిళా రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోందని గుర్తుచేసిన సీఎం, సాధించే సమయానికి అడ్డుకోవడం క్షమించరాని తప్పిదమని అన్నారు. “ఇది ప్రారంభం మాత్రమే… మహిళా లోకం మొత్తం ఏకమైంది” అంటూ మహిళలు ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను సీఎం ఖండించారు. దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలు లేదా చిన్న రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని తెలిపారు. 2017లోనే అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
2029 నాటికి మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆయన చెప్పారు. అయితే మహిళలు ఎదగడం కొందరికి నచ్చడం లేదని, ఆడబిడ్డలను ఇంటి వరకే పరిమితం చేయాలనే దురుద్దేశంతో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఓడించడం దుర్మార్గమని వ్యాఖ్యానించిన సీఎం, ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాయో ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.
“నిన్న విద్రోహ దినం… విపక్షాల ద్రోహాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి” అంటూ ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మహిళా సాధికారత కోసం అడ్డంకులు సృష్టించకుండా సహకరించడం విపక్షాల బాధ్యత అని అన్నారు. చివరిగా, మహిళలకు నిజమైన న్యాయం జరగాలంటే విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.